‘ములుగుచేప’కు భలే క్రేజీ!
అరుదుగా లభించే ఈ రకం చేపలు
ఔషధకారిగా ప్రచారంతో డిమాండ్
కిలో రూ. 400 నుంచి 500
పెబ్బేరు రూరల్, మే 7: మనం ఆహారంగా తీసుకొనే చేపలు ఎన్నో రకాలు. ఒక్కో చేపకు ఒక్కో ప్రత్యేకత, రుచి ఉంటుంది. కొన్ని చేపలు మాత్రం చాలా అరుదుగా లభిస్తాయి. వాటిలో ఒకటి ‘ములుగు చేప’. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వీటిని పిలుస్తారు. ఎక్కువగా మలుగుమేనుగా ప్రచారంలో ఉండగా, ఈ ప్రాంతంలో మాత్రం దీనిని ‘మునుగుమియ చేప’గా పిలుస్తారు. ఆరోగ్యప్రదాయని, ఔషధగనిగా పేరున్న ఈ చేపను మృగశిర కార్తె రోజున ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. మంగళవారం మృగశిర కార్తె సందర్భంగా ములుగు చేపపై ప్రత్యేక కథనం..
పామును పోలి ఉండే చేప
పామును పోలి ఉండే మునుగుమియ చేపకు పెబ్బేరు పరిసర ప్రాంతంలో చాలా డిమాండ్ ఉంది. ఈ మండలంగుండా పారుతున్న కృష్ణానదిలో ఏడాదిలో ఒకసారి మాత్రమే ఇది లభిస్తుంది. ప్రతి వేసవిలో నదిలో నీరు తక్కువైన సందర్భంలో రాళ్లు, బొరియల మధ్య నివాసముంటూ ఇది జాలర్లకు చిక్కుతుంది. అలాగే పెద్ద పెద్ద రిజర్వాయర్లలో కూడా ఈ చేప దొరుకుతుంది. చెరువులు, కుంటల్లో ఈ చేప లభించదు. ఈ చేప వలకు చిక్కిందంటే జాలరికి ఆ రోజు పండుగేనని చెప్పొచ్చు. ఇతర చేపల ధరలతో పోలిస్తే మునుగుమియ చేపకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. కిలో చేప ధర రూ.500 దాకా పలుకుతుంది. మాంసం ప్రియులు ఎగబడి ఈ రకం చేపలను కొనుగోలు చేస్తుంటారు. అసలు మార్కెట్ వరకు రానీయకుండానే స్థానికంగానే దీన్ని కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు.
ఔషధాలగనిగా..
ఇతర చేపలకు భిన్నంగా మునుగుమియ చేపకు మనిషిని పోలిన చెవులుంటాయి. వలను చీల్చుకొని బయటపడే బలమైన చేపగా పేరుంది. మునుగుమియ చేపను ఔషధకారిగా భావిస్తున్నందునే దీనికి ఇంతగా డిమాండ్ ఏర్పడింది. మార్కెట్కు ఈ రకమైన చేప వచ్చిందంటే చాలు జనం ఎగబడుతారు. ఈ చేప గురించి అవగాహన ఉన్న వారు మాత్రమే దీన్ని ఇష్టపడుతుంటారు. ఈ చేపలో పలు రకాల ఔషధగుణాలున్నట్లు ప్రచారంలో ఉంది. చేపకూరే కాదు చేపపై ఉండే పొలుసు కూడా ఔషధంగా పనిచేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ముఖ్యంగా మగవారికి శక్తినిస్తుందని చెబుతుంటారు. ఇతర చేపలకు భిన్నంగా దీనిపై ఉన్న పొలుసుకు బాగా జారుడు గుణం ఉంటుంది. అందుకే పిండిని అద్ది చేపను శుభ్రపరుస్తారు. డిమాండ్ను బట్టి మార్కెట్లో దీనికి రేటు ఉంటుంది. రెండు నుంచి అయిదడుగుల పొడుగు ఉండి, సుమారు 20కిలోల వరకు చేపలుంటాయని కృష్ణానదిలో చేపలు పట్టే మత్స్యకారులు చెబుతున్నారు.