జడ్చర్లటౌన్, ఏప్రిల్21: జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా బుధవారం మొత్తం 13మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఇన్చార్జి కమిషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికలో వివిధ వార్డులకు మొత్తం 241సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో రెండు తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. మంగళవారం ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా, బుధవారం 13 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఆరో స్వతంత్ర అభ్యర్థి చెన్నకేశవులు, 11వ వార్డులో బీజేపీ రెబల్ అభ్యర్థి రమాదేవి, 13వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి మల్లికార్జున్, 14వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ప్రభావతి, 16వ వార్డులో బీజేపీ రెబల్ అభ్యర్థి సుగుణమ్మ, 20వ వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి సుప్రియ, స్వతంత్ర అభ్యర్థి గాయత్రీ, 23వ వార్డులో స్వతంత్ర అభ్యర్థులు రేణుక, శ్రీనివాసులు, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గౌతంకుమార్, 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి యశోద, 27వ వార్డులో స్వతంత్ర అభ్యర్థులు చంద్రకాంత్, లక్ష్మమ్మ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
బుజ్జగింపులు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఆశించి భంగపడి అసంతృప్తిగా ఉన్న వారిని ఆయా రాజకీయ పార్టీలు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తరపున టికెట్ దక్కని వారు మున్సిపల్ ఎన్నికల్లో పలువార్డుల్లో రెబల్గా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కావడంతో రాజకీయ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన అసంతృప్తి నాయకులను జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సముదాయించారు. దీంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.