జీడిమెట్ల, ఆగస్టు 13 : ఓ వివాహిత హత్య కేసును జీడిమెట్ల పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జీడిమెట్ల సీఐ కె. బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఆజాంఘర్ జిల్లా లోనాపార్కుకు చెందిన సుజీత్ యాదవ్, రింకూ యాదవ్ భా ర్యాభర్తలు. వీరు జీడిమెట్లలోని వినాయకనగర్లో నివాసం ఉంటున్నారు. సుజీత్ యాదవ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కూకట్పల్లిలో ప్రైవేటు ఉద్యోగం చేసే రాజేశ్ ఐదేండ్లుగా వీరితో షేరింగ్ రూంలో ఉం టున్నాడు. ఈక్రమంలో సుజీత్ యాదవ్ ఇంట్లోలేని సమయంలో రింకూ యాదవ్తో రాజేశ్ వివాహేతర సంబంధం పెట్టుకుని వారికి ఆర్థి కసాయం చేయడంతో పాటు ఇంట్లో సరుకులు తెస్తుండేవాడు. 2021 ఏప్రిల్లో రాజేశ్కు జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన పూజతో వివాహమైంది.
అనంతరం రాజేశ్, పూజ షేరింగ్ రూంలోనే ఉంటున్నారు. పెండ్లి అయిన తర్వాత రాజేశ్ రింకూయాదవ్ను పట్టించుకోక పోవడం తో పాటు మరో గదిని అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో మళ్లి రాజేశ్ను తనవైపు తిప్పుకోవాలంటే రాజేశ్ భార్య పూజను అడ్డు తొలగించుకోవాలని భార్యాభర్తలు పథకం పన్నారు. ఈ నెల 10న రాజేశ్ పని నిమిత్తం బయటకు వెళ్లగా పూజ ఒక్కతే ఉం డటంతో ఇదే సరైన సమయమని భావించిన రింకూ యాదవ్, సుజీత్యాదవ్ పూజ ముఖం పై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా హత్య చేశారు. ఆపై నేరం తమపై రాకుండా పూజ ఒంటిపై ఉన్న బంగారు నగలను కాజేశారు.
కొద్ది సేపటి తర్వాత వచ్చిన రాజేశ్కు కట్టుకథ చెప్పి పూజ మాజీప్రియుడు వచ్చి తనతో పాటు రమ్మని బలవంతం చేశాడని, రానని చెప్పడంతో హత్య చేసి వెళ్లాడని దంపతులిద్దరూ నమ్మబలికారు. రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఆధారంగా విచారించి నిజాలను రాబట్టారు. రింకూయాదవ్, సుజీత్యాదవ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తామే పూజను హత్య చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.