దుండిగల్: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలకు సమాచారం చేరవేయడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైందని భారతజాతీయ మహాసముద్ర సమాచార సేవాకేంద్రం(ఇన్కాయిస్) డైరెక్టర్ డా.టీ.శ్రీనివాసకుమార్ అన్నారు. ఇన్కాయిస్లో “రీజనల్ వర్క్షాప్ ఆన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ మీడియా అండ్ సునామి వార్నింగ్ చైన్ “పేరుతో మూడు రోజుల పాటు సదస్సు జరుగుతుంది. ఇందులో భాగంగా ఇన్కాయిస్ డైరెక్టర్ శ్రీనివాసకుమార్తో పాటు పలువురు శాస్త్రవేత్తలు మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్కుమార్ మాట్లాడుతూ సముద్రగర్భంలో చోటుచేసుకునే భూకంపాలు, సునామీలను ఇన్కాయిస్ ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రభుత్వానికి, జాతీయ విపత్తుల నివారణ సంస్థకు, ప్రజలకు సమాచారం చేరవేస్తూ విపత్తులనుంచి ప్రాణనష్టం జరగకుండా కాపాడుతుందని తెలిపారు. ప్రధానంగా సముద్ర తీరప్రాంతప్రజలు, మత్స్యకారులు, నావికాధళాలు, సముద్రమార్గ వ్యాపారులకు ఎప్పటికప్పుడు సముద్రగర్భంలో జరిగే పరిణామాలను వివరిస్తూ అప్రమత్తం చేస్తుందన్నారు.
సముద్రగర్భంలో ఏర్పడే సునామి తీవ్రత ఎంత, దీని ప్రభావం ఏఏ ప్రాంతాలపై ఉంటుంది. ఎంతసేపట్లో ప్రభావితం చేస్తుంది అనే విషయాలను ఖచ్చితంగా లెక్కించి సమాచారాన్ని ముందుగా నేషనల్ డిస్టార్ మేనేజ్మెంట్ అథారిటీకి(ఎన్డీఎంఏ)కి సమాచారం అందజేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో జాతీయ రేడీయో కేంద్రాలు,టెలివిజన్ కేంద్రాలకు సైతం సమాచారం చేరవేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అక్కడి నుంచి జిల్లా విపత్తు నివారణ అధికారులుకు సమాచారం వెళుతుందని తెలిపారు. దీంతో స్థానిక అధికారులు ప్రజలను, మత్స్యకారుల, సముద్రవ్యాపారులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలను ప్రసారం చేసే విషయంలో ప్రస్తుతం కొంత గందగోళం నెలకొందన్నారు. ఇతర దేశాలల్లో సంభంవించే సునామిలకు ఇండియన్ ఓసీయన్ కంట్రీస్తో సంబంధం లేక పోయినప్పటికి కొన్ని సార్లు పొరపాట్లు జరిగే అవకాశముందన్నారు.
మీడియా సైతం విపత్తుల వేళ క్రియాశీల పాత్ర నిర్వర్తిస్తుండడం అభినందనీయమన్నారు. సదస్సులో ఇన్కాయిస్ గ్రూప్ డైరెక్టర్ డా.టీఎం.బాలకృష్ణన్ నాయర్, శాస్త్రవేత్తలు బి.అజయ్కుమార్, సీహెచ్.పతాంజలీ కుమార్, ఎంవీ. సునంద, డా.సుధీర్జోసేఫ్ తదితరులు పాల్గొన్నారు.