ఏ బైక్ దొంగలైనా ఏం చేస్తరు? ఏ బైక్ కనిపించినా ఎత్తుకెళ్తరు! కానీ, ఈ ఇద్దరు దొంగలది మాత్రం సెపరేట్ రూట్! కేవలం ఒకే కంపెనీకి చెందిన వాహనాలను మాత్రమే దొంగిలించడం వీళ్ల స్పెషల్! జల్సాలకు అలవాటుపడి.. ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో కరీంనగర్ టౌన్లో 22 ద్విచక్రవాహనాలను ఎత్తుకెళ్లారు. వాటిని రేణికుంటలో దాచిపెట్టడంతోపాటు కొన్నింటిని అమ్ముకున్నారు. కొంతకాలంగా నగరంలో దొంగతనాలు పెరుగడంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎట్టకేలకు ఆ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ చోరుల వద్ద ఒకే కంపెనీకి చెందిన వందల కీస్ ఉండడంతోనే వాహనాలను సులువుగా ఎత్తుకెళ్తున్నట్టు తెలిసింది.
తిమ్మాపూర్, ఏప్రిల్ 26 : ఇటీవలి కాలంలో కరీంనగర్ టౌన్లో ద్విచక్రవాహనాల చోరీలు పెరుగడం కలకలం రేపుతున్నది. ఈ క్రమంలో తరచూ ఫిర్యాదులు రావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో రంగంలోకి దిగిన వన్టౌన్ పోలీసులు, ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే రేణికుంటలో నంబర్లు లేని ద్విచక్రవాహనాలు తిరుగుతున్నాయని గ్రామస్తుల ద్వారా అందిన సమాచారాన్ని తిమ్మాపూర్ పోలీసుల నుంచి తెలుసుకున్నారు. వారి సహకారంతో నిఘా పెట్టారు. శుక్రవారం తెల్లవారు జామున 6గంటల వరకే ఐదుగురు పోలీసులు రేణికుంటకు చేరుకున్నారు.
ఇది వరకే చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న గోనెల శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. కూపీ లాగితే బోయిని చంద్రబాబుతో కలిసి దొంగతనాలకు పాల్పడినట్టు అంగీకరించాడు. కరీంనగర్లో బైక్లను దొంగిలిస్తూ రేణికుంటలో దాచినట్టు, కొన్నింటిని అమ్మినట్టు ఒప్పుకొన్నారు. వారి ద్వారా సేకరించిన సమాచారంతో గ్రామంలో జల్లెడ పట్టి 22 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వాటన్నింటిని పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచగా.. గ్రామస్తులు చూసి నివ్వెర పోయారు. వాహనాలు అన్నీ ఒకే కంపెనీవి కావడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ బైక్లన్నింటినీ ట్రాక్టర్లలో ఉంచి కరీంనగర్లోని వన్టౌన్కు తరలించారు. కేసు ఇంకా దర్యాప్తు జరుగుతున్నదని ఎల్ఎండీ ఎస్ఐ చేరాలు తెలిపారు.