సూర్యాపేట, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హయాంలో నిండుకుండలా జలకళను సంతరించుకున్న చెరువులు.. దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికి పైగా చెరువులు నీళ్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ సమయంలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా, కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను వదిలి చెరువులను నింపకపోవడమే దీనికి ప్రధాన కారణం. జిల్లాలో 1,225 చెరువులకు గాను 0-25 శాతం నీటి నిల్వ ఉన్న చెరువులు 880 ఉండగా, 50శాతం నీళ్లు ఉన్న చెరువు ఒక్కటి కూడా లేదు.
సమైక్య పాలనలో వేసవి వచ్చిందంటే చాలు తాగునీరు లేక ప్రజలు రోడ్లు ఎక్కి ధర్నాలు చేసేది. యాసంగి చివరలో ఎండిన పొలాలను చూసి తట్టుకోలేక రైతులు పంటలను తగులబెట్టిన పరిస్థితులు ఉండేవి. భూగర్భ జలాలు అడుగంటి ఆగి పోసే బోర్లు.. నీళ్లు లేక నెర్రెలుబారిన చెరువులు దర్శనమిచ్చేది. అటువంటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్, మూసీ, కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు పుష్కలంగా వచ్చాయి. వర్షపాతం తక్కువ ఉన్న సమయాల్లో నాడు జిల్లా మంత్రిగా ఉన్న ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి కాల్వల ద్వారా నీటిని విడుదల చేయించి చెరువులను నింపి సాగు, తాగునీటికి సమస్య తలెత్తకుండా చేశారు. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కరువు కరాళ నృత్యం చేస్తున్నది. ఎనిమిదేండ్ల తర్వాత చెరువులు వట్టిపోయి దర్శనమిస్తున్నాయి.
ప్రభుత్వ అవగాహనారాహిత్యమో.. నిర్వహణ లోపమో గానీ జిల్లాలోని చెరువులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొత్తం చెరువుల్లో దాదాపు 80 శాతం ఒట్టిపోయాయి. సూర్యాపేట జిల్లాలో 1,225 చెరువులు ఉండగా.. గతేడాది ఏప్రిల్లో 45 చెరువులు సర్ప్లస్ స్టేజీలో (అలుగు పోయడం) ఉండగా, 878 చెరువుల్లో 75 శాతానికి పైగా నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం సర్ప్లస్ చెరువులు 75శాతమే కాదు, 50శాతం జలాలు ఉన్న చెరువులు జీరో ఉండడం గమనార్హం. ప్రస్తుతం 680 చెరువుల్లో 0-25 శాతం జలాలు ఉండగా, 25 నుంచి 50 శాతం జలాలు ఉన్న చెరువులు 325 మాత్రమే ఉన్నాయి.
ఈ సీజన్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సరిపడా నీళ్లు ఉన్నా ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడం.. మూడు పిల్లర్లు కుంగాయనే నెపంతో కాళేశ్వరం ప్రాజెక్టును పడుకోబెట్టడంతో కరువు పరిస్థితులు అలుముకున్నాయి. వెరసి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వరి పొలాలు కాపాడుకునేందుకు కనీసం ఒక్క తడికి నీటిని విడుదల చేయాలని రైతులు కోరినా పట్టించుకోకపోవడంతో పంటలు పెద్ద ఎత్తున ఎండిపోయాయి. కనీసం తాగునీటి కోసమైనా చెరువులను నింపాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలో తాగునీటి కోసం జనం నానా తంటాలు పడుతున్నారు. భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీళ్లు ఉండేలా చెరువులు నింపకుంటే మరికొద్ది రోజుల్లో దాహార్తితో ప్రజలు అవస్థలు పడడం ఖాయం. ఇప్పటికైనా జిల్లా మంత్రి స్పందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.