Marriage | మేళతాళాల మధ్య బంధువుల ఇండ్లకు తిరుగుతూ నుదిట బొట్టుపెట్టి దిద్ది పెండ్లి పత్రికలు పంచిన కాలం కనుమరుగైంది. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టుపెట్టి పెండ్లి పత్రికను తలుపులకు కట్టిన రోజులు చెరిగిపోయాయి. దూరపు ఊర్లలో ఉన్న చుట్టాలకు చాకలి, మంగళికి కార్డులిచ్చి పంపే ఆనవాయితీ కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తున్నది. చాలా చోట్ల మారుతున్న కాలం, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పాత సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నారు. పెండ్లి పత్రికలు పంచే సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతున్నది. వాట్సాప్, ఇన్స్టాలు పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాల ఆహ్వానాలకు వేదికలు అవుతున్నాయి.
అందోల్ : మా ఇంట్లో మా కూతురు, కొడుకు పెండ్లి.. మీరు కుటుంబ సమేతంగా తప్పనిసరిగా హాజరుకావాలి.. పెండ్లి పత్రికలో తేదీ జర యాది పెట్టుకోండి… అంటూ ఆప్యాయంగా అందించే పెండ్లి పత్రిక పలకరింపు మారింది. మారుతున్న కాలంతోపాటు ప్రజలు మారుతూ పెండ్లి పత్రికల స్థానంలో సోషల్ మీడియాను ఆదరిస్తూ ఆహ్వానాలు పంపుతున్నారు. దీంతో వాట్సాప్, ఇన్స్టాలు పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాల ఆహ్వానాలకు వేదికలవుతున్నాయి. ఒకప్పుడు మేళతాళాలతో బంధువుల ఇండ్లకు తిరుగుతూ బొట్టుపెట్టి పెండ్లి ఆహ్వాన పత్రికను అందజేసి పిలిచేవారు. పత్రిక తీసుకువెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టుపెట్టి పెండ్లి పత్రికను తలుపులకు కట్టేవారు. దూరంగా ఉన్న ఊర్లలో ఉన్న బంధువులకు కార్డులు పంపాలంటే ఇంటి నాయీబ్రాహ్మణులు, రజకులతో పంపిణీ చేయించేవారు. ఈ ఆనవాయితీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నా, చాలా చోట్ల మారుతున్న కాలం, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పాత సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నారు. గతంలో ఒక్కో పెండ్లికి వేల సంఖ్యలో కార్డులు ప్రింట్ చేయించినా కుటుంబాలు ఇప్పుడు నామమాత్రంగా వందల్లోనే కార్డులు ప్రింట్ వేయిస్తున్నారు. ప్రింట్ చేయించిన కొద్దిపాట్టి కార్డులను సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసి బంధువులను, స్నేహితులను ఆహ్వానిస్తున్నారు. దీంతో డబ్బు, సమయం రెండు ఆదా అవుతూ చెప్పాలనుకున్న విషయం సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తున్నారు.
పెండ్లితో పాటు చిన్న చిన్న శుభకార్యాల ఆహ్వానాలకు సోషల్ మీడియా వేదికగా మారుతున్నది. పిల్లల పుట్టిన రోజు వేడుకలు, తొట్టెలు, పుట్టు పంచెలు, ఒల్లెలు, పదవీ స్వీకరణ, విరమణ… ఇలా ప్రతి ఫంక్షన్కు ఆహ్వానం వాట్సాప్లో చేరవేస్తుండగా, సోషల్ మీడియా రాకముందు ఓ వెలుగు వెలిగిన ప్రింటింగ్ ప్రెస్లు వెలవెలబోతున్నాయి.
సోషల్ మీడియా ప్రభావం లేనప్పుడు పెండ్లి పత్రికలపై సీతారాముల ఫొటోలు తప్పనిసరిగా ఉండేవి. ఇందులో సీతాదేవీ వరమాలతో సిగ్గులొలుకుతూ నిలబడితే రాముడు కోదండధరుడై ఓరచూపులతో సీతాదేవిని చూస్తుండేవారు. క్రమంగా వీళ్ల స్థానంలో వధూవరులు వచ్చి చేరడంతోపాటు పెండ్లి కార్డులు ప్రింటింగ్ ప్రెస్ల నుంచి ఫొటో స్టూడియోలకు మారాయి. పెండ్లి ఆహ్వాన పత్రికల రూపం పోయి ఫొటోల రూపంలో రావడం మొదలై ఇంటింటికీ తిరిగి ఆహ్వానం పలికే రోజు నుంచి వాట్సాప్, ఇన్స్టా, మెయిల్ రూపంలో ఆహ్వానాలు అందే రోజులు వచ్చాయి. ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేయగానే వధూవరుల పేర్లు, ఫొటోలతోపాటు సినిమా పాటల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పెండ్లి తేదీ, స్థలం వీడియో రూపంలో వచ్చేస్తున్నది. ‘సమయం లేకపోవడంతో అందరిని వ్యక్తిగతంగా కలవలేకపోతున్నాం.. ఇదే ఆహ్వానంగా భావించండి.. తేదీ సేవ్ చేసుకొండి’… అంటూ చిన్న వీడియోలో అన్ని విషయాలు చెప్పేస్తున్నారు.
బ్రాహ్మణులు లగ్న పత్రిక రాసింది మొదలు పెండ్లి సందడి మొత్తం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నది. మెహందీ, సంగీత్, మంగళస్నానాలు, పెండ్లి, భరాత్, డిన్నర్ ఫంక్షన్ ఇలా ప్రతి కార్యక్రమానికీ వాట్సాపే వేదికగా మారుతున్నది. పెండ్లి జరుగుతున్న ఇంటివారి పేరుతో ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు తయారు చేసి బంధువుల నంబర్లు అందులో చేర్చి పెండ్లి సందడి పూర్తి ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ పెండ్లి
వేడుకలకు మరింత ఆనందాన్ని జోడిస్తున్నారు.
గతంలో పెండ్లిళ్లకు నెల రోజుల ముందు నుంచే ఆహ్వాన పత్రికలను పంచేవాళ్లం. కానీ సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఎక్కడికైనా, ఎంత దూరంలో ఉన్నవారికైనా క్షణాల్లో ఆహ్వాన పత్రికలను పంపుతున్నాం. పెండ్లి తేదీ పెట్టుకున్న రోజు నుంచి పెండ్లి ముగిసే వరకు ఆ సందడి మాటల్లో చెప్పలేనిది. ఎవరికైనా పత్రిక ఇవ్వండం మరిచిపోతామనే నెల ముందే వారి పేర్లు వరుసగా రాసుకుని వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఎవరి పేరైనా మరిచిన క్షణాల్లో వాట్సాప్ చేస్తున్నాం. సైకిళ్లపై వెళ్లి కార్డులు ఇచ్చే రోజు నుంచి సైలెంట్గా వాట్సాప్లో కార్డులు పంపే రోజులోచ్చాయి. – ప్రేమ్కుమార్, విశ్రాంత ఉద్యోగి, జోగిపేట
సోషల్ మీడియా వాడకం విఫరీతంగా పెరిగిపోవడంతో అన్ని శుభాకార్యాల ఆహ్వానాలకూ ఇప్పుడు అదే వేదికైంది. గతంలో పెండ్లిళ్లకు పెద్ద సంఖ్యలో పత్రికలను అచ్చు వేయించడంతోపాటు చిన్న చిన్న శుభాకార్యాలకు సైతం పత్రికలను అందజేసి ఆహ్వానం పలికేవారు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త సంతవ్సరం, ఇతర సంతోషాలను సైతం గ్రీటింగ్ రూపంలో వ్యక్తం చేసేవారు. ఎప్పుడైతే సోషల్ మీడియా వాడకం పెరిగి ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు వాడడం మొదలు పెట్టారో గ్రీటింగ్ కార్డులు కనుమరుగయ్యాయి. మాకు ఉపాధి సైతం లేకుండా పోయింది.
– తమ్మళ్లి వెంకటేశం, జనరల్ స్టోర్స్ నిర్వాహకుడు, జోగిపేట
కొన్నేండ్లుగా సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. దీంతో పెండ్లిళ్లకు కార్డులను ప్రింట్ చేయించేవారి సంఖ్య కూడా తగ్గింది. చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్ మొదలకొని పెండ్లి పత్రికలను సైతం ఫొటో స్టూడియోల్లోనే ప్రింట్ చేయిస్తున్నారు. దీంతో తమలాంటి ప్రింటింగ్ ప్రెస్ వాళ్లకు పనిలేకుండా పోయింది. గతంలో రెండు వేల పత్రికలను ప్రింట్ చేయించిన వారు ఇప్పుడు 2 వందల పత్రికలతోనే సరిపెడుతున్నారు. తొట్టెలు, గృహప్రవేశాలు, పుట్టినరోజు, పుట్టు పంచెలు… ఇలా ప్రతి శుభకార్యమూ గతంలో పత్రికల రూపంలో ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని ఆహ్వానాలకూ వాట్సాప్ వేదికైంది.
– వెంకటేశ్, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు, జోగిపేట
“Friendship | తనను పిలవలేదని నా ఫ్రెండ్ ఫోన్ తీయడం మానేసింది.. మా బంధం నిలుపుకునే మార్గం చెప్పండి”