చేర్యాల, ఆగస్టు 10 : శుష్క ప్రియాలు..శూన్యహస్తలతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో యాత్ర బంద్ చేసుకొని.. కేంద్రం నుంచి న్యాయపరంగా తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకువస్తే దండలు వేసి సన్మానిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మండలంలోని వీరన్నపేట గ్రామ సమీపంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కులు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
న్యాయపరంగా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా రాష్ర్టా అభివృద్ధిని అడ్డుకుంటున్నట్లు తెలిపారు. అహర్నిషలు తెలంగాణ ప్రజల బాగోగుల కోసం తపిస్తున్న టీఆర్ఎస్ సర్కారు వ్యతిరేకంగా బండి సంజయ్ యాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
పాదయాత్ర వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని వెంటనే పాదయాత్ర బంద్పెట్టుకొని కేంద్రంలో ఉన్న మోదీ, అమిత్షా వద్దకు వెళ్లి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకువస్తే జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు తాను దండలు వేసి దండం పెడుతామన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, జెడ్పీటీసీ శెట్టె మల్లేశం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, సర్పంచ్ కొండపాక భిక్షపతి, ఎంపీటీసీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.