కొండపాక, నవంబర్ 12 : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడంలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమైందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని కుకునూరుపల్లికి పలు అభివృద్ధి పనులకు ఐఎస్వో గుర్తింపు లభించింది.
ఆ సర్టిఫికెట్లను ఎంపీ శుక్రవారం సర్పంచు పొల్కంపల్లి జయంతికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుకునూరుపల్లి ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలు పోటీ పడి అభివృద్ధి చేయాలన్నారు. గతంలో గ్రామాలు ప్రభుత్వ పాలనలో నిర్వీర్యం అయ్యాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడు సంవత్సరాల్లో గ్రామా అభివృద్ధి జరిగి మహార్దశ ఏర్పడిందన్నారు.
పల్లెలను పట్టణాలుగా మార్చాలనే సీఎం కేసీఆర్ లక్ష్యంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కుకునూరుపల్లిని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామలు ఇలాంటి సర్టిఫికెట్ పొందాలన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న సర్పంచును అభినందించారు. కుకునూరుపల్లి మండలం తొందరగా ఏర్పాటయ్యేలా కృషి చేస్తానన్నారు. ఐఎస్వో గుర్తింపు సర్టిఫికెట్లను సర్పంచుతో పాటు అన్ని శాఖల అధికారులకు అందజేశారు.
కార్యక్రమంలో ఐఎస్వో ప్రతినిధి రిటైర్డ్ జడ్జి సుందరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి మహాదేవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ర్యాగళ్ల దుర్గయ్య, కాచం నవీన్కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, ఉప సర్పంచు బాలాగౌడ్, ఎంపీటీసీ సభ్యులు భూములుగౌడ్, నాయకులు రవీందర్, శ్రీనివాస్, కుమార్, సర్పంచులు వసంత ఋషి, కోల శ్రీనివాస్, డీఈవో రవికాంత్రావు, వ్యవసాయ శాఖ అధికారి ప్రభాకర్రావు పాల్గొన్నారు.