చేర్యాల, మార్చి 3 : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందడం కేంద్రంలో ఉన్న ప్రధాని మోదీ, అమిత్షాలకు ఇష్టం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల మండలంలోని దొమ్మాట గ్రామంలో గురువారం డీఎంఎఫ్టీ(డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నిధులు రూ.50లక్షల వ్యయంతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనం, మహిళ భవనాలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, జడ్పీటీసీ శెట్టె మల్లేశం,మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్తో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసపూరిత ప్రచారాలతో బీజేపీ నేతలు మభ్యపెడుతున్నారని విర్శించారు. 7 సంవత్సరాల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్గా అభివృద్ధి చెందడంతో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు మింగుడుపడడం లేదన్నారు. దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల పేరిట అధిక నిధులు వెళ్తుతున్నాయని, కాని రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధులు మాత్రం రావడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ర్టానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఒక్కరోజు పార్లమెంట్లో మాట్లాడ లేదని, కాని ఇక్కడకొచ్చి ప్రెస్మీట్లు పెట్టి మరీ ఉపన్యాసాలు ఇస్తున్నారని హెద్దేవా చేశారు.తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన నిధులు వెంటనే కేంద్రం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 7,8,9వ తేదీలలో మహిళల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.