Sri Sitaramula Kalyanam | రాయపోల్, ఏప్రిల్ 06 : దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణలు, బాజా బజంత్రీలతో రామచంద్రస్వామి కళ్యాణం జరిగింది. అంతకుముందు ఆలయ ధర్మకర్త అన్నారెడ్డి సుభాష్రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు. తలంబ్రాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చారు.
శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం వేద బ్రాహ్మణ పండితుల మధ్య భక్తుల జయ జయ ధ్వనుల మధ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకం, ఎదుర్కోళ్లు నిర్వహించారు. అలాగే రాయపోల్, దౌల్తాబాద్, అనాజీపూర్, వడ్డేపల్లి, ఎల్కల్, బేగంపేట మహ్మద్షాపూర్ తదితర గ్రామాలలో శ్రీరామచంద్రస్వామి కళ్యాణం నిర్వహించారు.
సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పొన్నంగి సేవ, మంగళవారం హనుమత్సేవ, బుధవారం గరుడ సేవ జరుగుతుంది. గురువారం తెల్లవారు జామున స్వామివారి రథోత్సవం జరుగుతుంది. శుక్రవారం శేషహోమం, పూర్ణాహుతి, శ్రీ పుష్పయాగం, ఉద్వాసనబలులు, సప్తవర్ణ ఏకాంత సేవ, తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.