సిద్దిపేట, జులై 12 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాగు నీటి కోసం సిద్దిపేట జిల్లా (Siddipet) రైతులు ఆశగా ఎదరు చూస్తున్నారు. రిజర్వాయర్ల నుంచి సాగునీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలు సరిగా లేక పోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయి. నారు మళ్లు ముదిరిపోతున్నాయి. ఈ సమయంలో రైతులకు సాగునీటిని విడుదల చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. రిజర్వాయర్లను నింపి అక్కడి నుంచి మా చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి గతంలో మాదిరిగా తాము సాగు చేసుకోవచ్చు అంటున్నారు. జూలై మాసం సగం పూర్తి కావోస్తున్నా ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవక పోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. విత్తనాలు వేస్తే అవి మట్టిలోనే వట్టిపోతున్నాయి. మరి కొన్ని చోట్ల మొక్కలు ఎండి పోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు మునిగే ప్రమాదం నెలకొంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేద్దామంటే నీళ్లు లేక వరి నార్లు ముదిరిపోతున్నాయన్నాయని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లో కూడా కాళేశ్వర జలాలను విడుదల చేయడంతో చెరువులు నిండుకుండలా ఉండేవి. వర్షాకాలం ప్రారంభం కాగానే కొద్ది పాటి వర్షానికి చెరువులు నిండిపోయేవి. దీంతో పుష్కలంగా సాగు నీరు అందింది. ప్రస్తుతం వర్షాలు లేక.. ఇటు సాగు నీరు లేక రైతుల్లో ఆందోళన నెలకొంది.
రైతుల చూపు రిజర్వాయర్ల చూపు
సిద్దిపేట జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వైపు ఆశగా రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత సమయంలో రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేస్తే తాము సాగు పనులు చేసుకోవచ్చు అని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిశగా ఆలోచన చేయాలని రైతులు కోరుతున్నారు. సాగు నీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఉన్న ప్రాజెక్టులో నీటిని నింపి విడుదల చేయాల్సిన ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. ఉన్న ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పరిధిలోకి వచ్చే రిజర్వాయర్లను చూస్తే రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్ద్యం 3.5 టీఎంసీల సామర్ధ్యం కాగ మూడు టీఎంసీలు నింపారు. ప్రస్తుతం ఇందులో 1.22 టీఎంసీలు, రంగనాయక సాగర్ రిజర్వాయర్ సామర్ధ్యం 3 టీఎంసీలు కాగ 2.9 టీఎంసీలు నింపారు. ప్రస్తుత నీటి మట్టం 1.05 టీఎంసీలు, తోగుట మండలంలోని మల్లన్నసాగర రిజర్వాయర్ సామర్ధ్యం 50 టీఎంసీలు కాగ యాసంగి సాగు సమయంలో 18.5టీఎంసీల నీటిని నింపారు. ప్రస్తుతం 10 టీఎంసీలు ఉన్నాయి. మర్కూక్ మండలంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ సామర్ధ్యం 15 టీఎంసీలు కాగ 10 టీఎంసీల నీటిని నింపగా ప్రస్తుతం 4.96 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆయా రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసి ఆ రిజర్వాయర్ల పరిధిలోని చెరువులు, కుంటలు నింపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆందోళనలో రైతాంగం..
జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వైపు రైతాంగాం చూస్తోంది. రిజర్వాయర్లను కాళేశ్వర జలాలతో నింపి మా చెరువులకు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు చేసుకున్న తరహాలో తాము సాగు చేసుకోవచ్చు అంటు ఆశగా సాగు నీటి కోసం రైతులు చూస్తున్నారు. ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవక పోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేస్తే అవి మట్టిలోనే వట్టిపోతున్నాయి. మరి కొన్ని చోట్ల మొక్కలు ఎండి పోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు మునిగే ప్రమాదం నెలకొంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు వేద్దామంటే నీళ్లు లేక వరి నార్లు ముదిరిపోతున్నాయని రైతులు తెలుపుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండు టెండల్లో కాళేశ్వర జలాలను చెరువులకు విడుదల చేయడంతో చెరువులు నిండుకుండలా ఉండేవి. వర్శాకాలం ప్రారంభం కాగానే కొద్ది పాటి వర్షానికి చెరువులు నిండిపోయేవి.దీంతో పుష్కలంగా సాగు నీరు అందింది. గత వేసవిలో కాళేశ్వర జలాలను విడుదల చేయక పోవడం మూలంగా చెరువులు ఎండి పోయాయి. భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వర జాలలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజిలో ఉన్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
అప్పుడు పుష్కలంగా సాగు నీరు
సిద్దిపేట జిల్లాలో కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి పడిపోతున్నాయి. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీటితో కళకళలాడిన రిజర్వాయర్లు నేడు నీళ్లు లేక బోసి పోయి కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హాయంలో ఎక్కడో పుట్టిన గోదావరి నీళ్లు ఇక్కడి తీసుకవచ్చి బీడు బారిన పొలాలను పారించారు. రికార్డు స్థాయిలో రిజర్వాయర్లను, ప్రధాన కాల్వలను పూర్తి చేయించి ప్రతి చెరువు, వాగును, చెక్డ్యాంలను మండుటెండల్లో నింపారు. దీంతో యాసంగి, వానకాలంలో రైతులు పుష్కలంగా పంటలను పండించారు. గుంట జాగ లేకుండా అచ్చుకట్టి భూమికి బరువయ్యేలా పంటలు పండించారు. అలాంటి జిల్లాలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా రైతాంగానికి సాగు నీరు అందించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు రైతుల గురించి పట్టించుకోవడం లేదు. కనీసం కట్టిన ప్రాజెక్టులకు నింపి రైతులకు సాగు నీరు అందిద్దామనే ఆలోచన సైతం అధికార పార్టీకి రావడం లేదని రైతులు వాపోతున్నారు. అసలే వర్షాలు కురవడం లేదు. దీంతో రైతాంగం పరేషాన్లో ఉంది.