న్యూఢిల్లీ: రద్దీ సమయాల్లో విమాన చార్జీలు విపరీతంగా పెంచడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు అడ్డగోలుగా చార్జీలను నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్ లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. విమానయాన సంస్థలు నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే వారి విమానాలను నిలిపివేయవచ్చని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.
విమాన చార్జీలను క్రమబద్ధీకరించడానికి నిబంధనల రూపకల్పన ప్రక్రియ చివరిదశలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన సమయంలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్కౌశిక్ ధర్మాసనానికి సమాచారం ఇస్తూ.. ప్రభుత్వం ఈ ప్రక్రియను మూడు వారాల్లోగా పూర్తి చేసి, తుది నిబంధనలను కోర్టు ముందు ఉంచుతుందని తెలిపారు.