సిద్దిపేట, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొమురవెల్లి మల్లన్న ఆల యం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రాష్ర్టానికే తలమానికం ఆలయం నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యా ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవంలో మంత్రి హరీశ్రావు పాల్గొని మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న మన కొంగు బంగారమని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ఈ ఆలయం ప్రతీక అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో దివ్యక్షేత్రంగా మారిందన్నారు. ఈసారి స్వామివారి కల్యాణాన్ని ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించిందన్నారు. ఈ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పా రు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.స్వామి వారిని సీఎం కేసీఆర్ రెండుసార్లు దర్శించుకున్నారన్నారు.
మల్లన్న ఆశీస్సులతో రిజర్వాయర్ పూర్తి..
కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటి మల్లన్నసాగర్ రిజర్వాయర్ను మల్లన్న స్వామి ఆశీస్సులతో త్వరితగతిన పూర్తి చేసుకున్నట్లు మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతిపక్షాలు ఈ రిజర్వాయర్కు ఎన్నో అవాంతరాలు కల్పించాయని, అన్నింటిని దాటి స్వామి వారి దయతో సకాలంలో పూర్తిచేసుకున్నామన్నారు. రైతాంగానికి సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభం చేసుకున్న రోజున సీఎం కేసీఆర్ స్వయంగా కలశాల ద్వారా గోదావరి జలాలు తెచ్చి మల్లన్నస్వామి పాదాలను స్వయంగా కడిగారని గుర్తుచేశారు. గత కల్యాణం సమయంలో చెప్పిన విధంగా మల్లన్న స్వామికి స్వర్ణకిరీటం చేయించి సమర్పించినట్లు మంత్రి తెలిపారు. వచ్చే మల్లన్న కల్యాణోత్సవానికి మేడలమ్మ, కేతలమ్మలకు కిలో బంగారంతో స్వర్ణకిరీటాలు చేయించునున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులకు కావాల్సిన క్యూలైన్ల కోసం రూ.11కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా త్వరలో 50గదుల కాటేజీలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. గర్భగుడి నుంచి కోనేరు నేరుగా కనిపించే విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.అశేష జనవాహిన సమక్షంలో జరిగిన మల్లన్న కల్యాణంలో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.