శివ్వంపేట/నర్సాపూర్/హత్నూర, డిసెంబర్ 29: రాష్ట్రంలో వరినాట్లు వేసే సమయమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అత్యవసరంగా ఎరువులు, రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందజేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శివ్వంపేట మండలం గూడూరులో శుక్రవారం సర్పంచ్ స్వరాజ్యలక్ష్మిశ్రీనివాస్గౌడ్, ఎంపీడీవో భారతితో కలసి ఎమ్మెల్యే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు సహకరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది కొత్తింటి ఇబ్బందులున్నా తినకుండా ఉండలేం కదా, కాబట్టి రైతులకు అత్యవసరంగా ఎరువులు, పెట్టుబడి సాయం వెంటనే అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులను ఏరోజుకారోజు ఆన్లైన్ చేయాలని, ప్రతిఒక్కరూ దరఖాస్తు రసీదు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువ వికాసం పథకానికి దరఖాస్తులు ఆహ్వానించడం లేదని, అందుకవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ముందుంటానన్నారు. అనంతరం ఎమ్మెల్యేను పాలకవర్గం ఘనంగా సన్మానించింది. అలాగే మండలంలోని మగ్దుంపూర్, పిల్లుట్ల, లింగోజిగూడ గ్రామాల్లో ప్రజాపాలన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు లాయక్, ప్రత్యేకాధికారి నర్సయ్య, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎంపీవో తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు యాదాగౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీ నువ్వుల దశరథ, హనుమంతు, ప్రభాకర్రెడ్డి, బేగరి నర్సయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
యువవికాసం ఎక్కడ?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ దరఖాస్తులో మాత్రం ఐదు గ్యారంటీలు మాత్రమే క్రోడీకరించడం జరిగిందని, యువవికాసం అంశాన్ని చేర్చలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం మున్సిపాలిటీలోని 3వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు వారి అర్హతను బట్టి దరఖాస్తు ఫారంలో పథకాలను ఎంచుకుని అధికారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, బీఆర్ఎస్ నాయకులు అశోక్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, నగేశ్, దావూద్, ఆంజనేయులు గౌడ్, రాకేశ్ గౌడ్, అధికారులు, పట్టణ వాసులు పాల్గొన్నారు.
పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హత్నూర, లక్మాతండాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబాలకు సరిపడా దరఖాస్తు ఫారాలు అందకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అధికారులు ప్రతికుటుంబానికీ దరఖాస్తు ఫారాలు అందజేయాలన్నారు.
ఎవ్వలు సక్కగా సెప్తలేరు?
అభయహస్తం దరఖాస్తులు ఎట్లా జెయ్యాలో ఎవ్వలు కూడా సక్కగా సెప్తలేరు. కొందరికీ ఫారాలు ఇచ్చిండ్రు, ఇంకొందరి ఇయ్యనేలేదు. మీరే జిరాక్స్లు తెచ్చుకొమ్మంటున్నారు. దరఖాస్తులో మీటర్ నంబర్, గ్యాస్ నంబర్ ఎయ్యాలని ఉన్నది. గ్యాస్ పుస్తకంలో రెండు, మూడు నంబర్లు ఉండడంతో ఏ నంబర్ ఎయ్యాలో తెలుత్తలేదు. అధికారులు జెర్ర తెలిసేటట్టు జెప్పాలి. దరఖాస్తు ఫారం ఎవ్వలకు అర్థమైతలేదు.
– నిమ్మ శోభ, మహిళా రైతు, అల్వాల (మిరుదొడ్డి)
అంతా గందరగోళంగా ఉంది
మా రేషన్కార్డులో నా కొడుకు, కూతురు పేర్లులేవు. అందులో వారి పేర్లు ఎక్కించాలని ఆడిగితే, ఇక్కడి అధికారులు దానికి సంబంధించిన వివరాలు చెప్పడంలేదు. ఆభయ హస్తం దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు ఉండాలని ఆడుగుతున్నారు. మరి వారికి ఈ పథకాలు వర్తిస్తాయా లేదా అనే విషయం నాకు ఆర్థం కావడంలేదు. మహాలక్ష్మి పథకం వర్తిస్తుందో లేదో అధికారులు చెప్పడంలేదు. అంతా గందరగోళంగా ఉంది.
– సింగరవేణి రమేశ్, గుర్రాలగొంది, సిద్దిపేట
అర్హత ఉన్నా ఫారం నింపలేదు
మా ఇద్దరిలో ఎవరికో ఒకరికి వృద్ధాప్య పింఛన్ వస్తుందేమోననే అశతో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినం. అయితే, ఆరుగ్యారంటీల్లో కొన్నింటికి మాత్రమే మీరు అర్హులని, పింఛన్ రాదని దరఖాస్తు తీసుకునే వారు చెప్పారు. ఆధార్ కార్డు ప్రకారం మాకు అరవై ఏండ్లకు పైగా వయస్సు ఉంది. అయినా దరఖాస్తు ఫారం తీసుకునేందుకు అంగీకరించలేదు. చివరికి గొడవ పడితే తప్ప నింపలేదు.
– కాసుల కిషన్, ఎల్లమ్మ (వృద్ధులు) లక్ష్మాపూర్
తెల్వని విషయాలు ఏం చెప్తలేరు
తెల్వని విషయాలను అధికారులు చెప్తలేరు. ఫారాలు ఇచ్చిండ్రు నింపుకొని రమ్మన్నరు. మాకు ఎట్లా నింపాలనో అర్థం కాక ఎవ్వలను బతిమిలాడినా నింపియడం లేదు. అధికారులే మాకు ఆ దరఖాస్తు ఫారాన్ని నింపిస్తే మంచిగ ఉంటది. సర్కారు చెప్పేది ఒకటి, అధికారులు చేసేది మరొకటి. మా దరఖాస్తు ఫారాలను అధికారులు నింపి సర్కారుకిస్తేనే మంచిగుంటది. శాన ఇబ్బందులు పడుతున్నం.
– సిద్దల మల్లవ్వ, బండారుపల్లి, తొగుట
రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు ఇస్తరంట
గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆరు గ్యారెంటీల ఫారాలు ఇస్తున్నారంటే తీసుకోడానికి వెళ్లిన. కానీ అక్కడ రేషన్ కార్డు చూపిస్తేనే దరఖాస్తు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రేషన్ కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇదే విషయం పంచాయతీ సెక్రటరీకి చెబితే ఓ వినతి పత్రం రాసి ఇవ్వాలన్నారు. వినతి పత్రం ఇస్తే దరఖాస్తు ఇస్తారా అని అడిగితే పొంతన లేని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. నాకు భార్య, కూతురు ఉన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రేషన్ కార్డు లేకుండా ఎలా పొందాలో సమజైతలేదు.
– పెంటయ్య, బ్రాహ్మణపల్లి, నర్సాపూర్