గజ్వేల్ : జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లోని మహతి ఆడిటోరియంలో బుధవారం ఉదయం జిల్లాలోని అన్నీ మండలాలు, గ్రామాల ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నాల్గవ విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహాక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్తో పాటు ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, రఘునందన్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. పట్టణ, పల్లె ప్రగతి పనులపై అంశాల వారీగా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రాధాన్యత పనులు చేపట్టాలని కోరారు. అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లే కాదు. పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే అన్నారు. రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయతీలకు గాను 19 వేల 298 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు, అదనంగా పలు గ్రామాల్లో రెండు చొప్పున 7 వేల పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు అయ్యాయని మంత్రి వెల్లడించారు. దేశంలో ఏ పల్లెకు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెకు నర్సరీ, డంప్ యార్డు, వైకుంఠ ధామం ఉన్నట్లు తెలిపారు.
తూతూ మంత్రంగా పని చేయొద్దు, సెలవులు పెట్టొద్దు. యుద్ధప్రాతిపదికన పల్లె, పట్టణ ప్రగతి సాధనలో ఆదర్శంగా నిలిచేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటాలని, హరితహారంలో నాటిన మొక్కలతో రోడ్లకు ఇరువైలా చెట్లు స్వాగతం పలుకుతున్నట్లు ఉండాలన్నారు. విద్యుత్ లైన్లు, పోల్ షిఫ్టింగ్ వంటి పెండింగ్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల గ్రామానికి, మున్సిపాలిటీకి నిధులు అందిస్తున్నాం. సమస్యలకు పరిష్కారం వెంటనే చూపాలన్నారు.
పట్టణ, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవన్నారు. వీరిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యులేనన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనులు అమలుకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లను నియమించినట్లు మంత్రి వెల్లడించారు. పనుల నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. కంపోస్ట్ షెడ్ లు నిర్మాణం పూర్తి చేయడమే కాక చెత్త సెగ్రిగేషన్ జరగాలని, వాటిని వాడుకలోకి తీసుకురావాలని, చెత్త సేకరణ చేసి డంప్ యార్డ్ తరలించి చెత్త వేరు చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు చెబుతూ వారి స్కేల్ వేతనాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఏప్రిల్ మాసం నుంచే అమలు జరగనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.