హుస్నాబాద్, జూన్ 21 : కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వారి ఉచ్చులో పడి భూ నిర్వాసితులు నష్టపోవద్దని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్దిదారులకు రూ.35,60,500ల విలువైన సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రిజర్వాయర్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియకుండా కొన్ని పార్టీల నాయకులు తమ ఇష్టంవచ్చినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 1.24టీఎంసీల సామర్థ్యం ఉన్నప్పుడు 937 కుటుంబాలకు గాను 927 కుటుంబాలకు, 8.23 టీఎంసీలకు పెంచాక 693 కుటుంబాలకు గాను 683 కుటుంబాలకు పరిహారం చెల్లించామని చెప్పారు.
రెండో దశలో సేకరించాల్సిన 2,055 ఎకరాల్లో కేవలం 84ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందని, ఈ భూములకు ఒక్కో ఎకరానికి రూ. 15లక్షలు ఇస్తామని చెప్పినా నిర్వాసితులు వినకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
నిర్వాసితుల్లో ఇంకా మార్పు రాకుంటే 2013 చట్టం ప్రకారం మాత్రమే చెల్లింపులు జరుగుతాయని, దీని వల్ల నిర్వాసితులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని 96వేల ఎకరాలకు సాగునీరంది ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, ఇందుకు భూనిర్వాసితులు సహకరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పరిసత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీలు మానస, మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, పాల్గొన్నారు.