సిద్దిపేట, డిసెంబర్ 12 : ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని, ప్రజా ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా వైద్యులు, వైద్యాధికారులు కృషి చేయాలని జిల్లా మెడికల్ కళాశాల, జిల్లా దవాఖాన అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సిద్దిపేట జిల్లా ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ కిషోర్కుమార్, మెడికల్ కళాశాల ఆర్ఎంవో హేమలత, జిల్లా వైద్య నోడల్ అధికారి డా.కాశీనాథ్, గజ్వేల్ సూపరిండెంట్ డా.మహేశ్లతో కలిసి మెడికల్ కళాశాల, జిల్లా ఏరియా దవాఖాన ప్రగతిపై మంత్రి హరీశ్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ఇక అన్ని వైద్య పరీక్షలు వైద్య కళాశాల, జిల్లా ఏరియా దవాఖానలోనే జరిగేలా చూడాలని, నెల రోజుల్లో సిటీ స్కాన్, రేడియాలజీ సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వైద్యాధికారులను ఆదేశించారు. ముందుగా వైద్య కళాశాల, జిల్లా ఏరియా దవాఖానలో అధునాతన పరికరాలు పెట్టుకొని వాడకపోతే ఎలా అని ఆరా తీస్తూనే.. తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో పనిచేసే వారి విధి విధానాలు నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని సూచించారు. మెడికల్ కళాశాలలో కావల్సిన అన్ని వైద్య పరీక్షలు తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్లో జరిగేలా.. చూడాలని అవసరమైతే షిప్టుల వారీగా మార్పులు చేయాలని ఆదేశించారు. నిత్యం డయాగ్నోస్టిక్ హబ్లో పనిచేస్తున్న వైద్య సేవలపై ఆరా తీయగా సేకరిస్తున్న శాంపిల్స్ లెక్కలను మంత్రికి వివరించారు.
వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ కళాశాలను పీజీ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు, పీజీ అడ్మిషన్లు జరిగేలా చూడాలని, కావల్సిన కోర్సులు, ఆసక్తి, డిమాండ్ ఉన్న కోర్సులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆమోదం ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులను ఫోన్లైన్లో మంత్రి ఆదేశించారు. సిద్దిపేటలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టి, అడ్మిషన్లు జరిగేలా చూడాలని డీఎంఈని ఆదేశించారు. కాగా, దవాఖానలో పెండింగ్లో ఉన్న కీలక అంశాలపై చర్చించి, క్షేత్రస్థాయిలో మెడికల్ కళాశాల, దవాఖానలను విజిట్ చేసి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా వైద్య విధాన పరిషత్ ఈఈని ఫోన్లైన్లో ఆదేశించారు. సిద్దిపేటలో జిల్లాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, మరోసారి మందులు లేవని తన దృష్టికి వస్తే సహించేది లేదని, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లాకు సరిపడా మందులు లేవని, ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీని ఫోన్లో ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా దవాఖానకు అవసరమైన ఎక్స్రే, మ్యానోగ్రామ్, ఈసీజీ, సిటీ స్కాన్, రేడియాలజీ తదితర మిషనరీలు తెప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
డిసెంబర్ నెలాఖరులోగా మొత్తం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి ..
రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, కావల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సివిల్ సైప్లె అధికారి, సిబ్బందిని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం వానకాలం పంట కొనుగోళ్లపై డీఎం సివిల్ సైప్లె అధికారి హరీశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరాంతో కలిసి సమీక్షించారు. వానకాలంలో వరిసాగు వివరాలు, రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలు, రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేసిన వివరాల గురించి డీఎంను ఆరా తీయగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, డిసెంబర్ నెలాఖరులోగా చివరి వారంలో మొత్తం కొనుగోళ్లు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో 3,17,161 ఎకరాల్లో రైతులు వానకాలం వరిసాగు చేసినట్లు, 412 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 67,773 మంది రైతుల నుంచి 2,83,954 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిపినట్లు, 363.83 కోట్ల రూపాయలను 42,485 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన 25,288 మంది రైతులకు రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చూడాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 24 కొనుగోలు కేంద్రాల్లో వందశాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని ఆయా ధాన్యం కొనుగోలు నిర్వాహకులను మంత్రి అభినందించారు. సమీక్షలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఓఎస్డీ బాల్రాజు తదితరులు పాల్గొన్నారు.