ప్రస్తుత పరిస్థితుల్లో ఆయిల్పామ్ సాగు మంచి ఆదాయ వనరు అని, నెలవారి జీతాలు వచ్చే వారి కన్నా ఆయిల్పామ్ రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం నంగునూరు మండలం నర్మెటలో రూ.300కోట్లతో 60 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్య, క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భవిష్యత్ డిమాండ్ దృష్ట్యా ఆయిల్పామ్ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తున్నదన్నారు. రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో సాగుచేస్తే కేంద్ర ప్రభుత్వమే మన రైతు దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తుందని సూచించారు. జిల్లా రైతులు ఆయిల్పామ్ సాగులో బ్రాండ్ అంబాసిడర్లు కావాలని మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నంగునూరు: ‘ఇవాళ చాలా సంతోషంగా ఉంది.. ప్రతి సందర్భంలో రాష్ట్ర ప్రజానీకం రెండు కారణాలతో సిద్దిపేట వైపు చూస్తది.. రాష్ట్రంలో ఏ కొత్త పని జరిగినా అది సిద్దిపేటలో ప్రారంభమవుతుంది.. మేం ఏం తలపెట్టినా.. ఏం పని కావాలన్నా.. ఆ డబ్బులు ఇచ్చేది సిద్దిపేట బిడ్డ సీఎం కేసీఆర్.. ఆర్థిక మంత్రి హరీశ్రావు. అందుకే సిద్దిపేట ప్రాంత ప్రజలంటే మా అందరికీ గౌరవం, అభిమానం..’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకపోయి, రాష్ట్రం సాధించి, ఏ రంగం తీసుకున్నా అందులో దేశంలోనే నంబర్స్థానానికి ఎగబాకించిన ఘనత సిద్దిపేట బిడ్డ సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
ఆ కార్యాచరణ అమలు చేసిన ఘనత హరీశ్రావుది అన్నారు. సిద్దిపేటలో శంకుస్థాపన చేసిన ఆయిల్ఫెడ్ కర్మాగారం రాబోయే పదితరాల ప్రజల జీవితాల తలరాతను మార్చేగొప్ప కార్యక్రమమన్నారు. ఆయిల్ఫెడ్ ద్వారా ఆయిల్పామ్ తోటలను విస్తరించడం, మూడేండ్ల తర్వాత వచ్చే గుత్తులను ఫ్యాక్టరీకి అమ్మాల్సి ఉంటుందన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో రూ.300కోట్లతో.. 60 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ధాన్య, క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. ఆయిల్పామ్తో వచ్చే లాభం ఏమిటో పరిజ్ఞానం లేకుండా సమైక్య పాలన సాగిందన్నారు. తెలంగాణ రైతాంగం పామాయిల్ పంట వైపు చూడకుండా పత్తి, జొన్నలు, రాగులు వంటి వాటి వైపే చూసేలా ఆ నాటి పాలకులు చేశారన్నారు. దేశంలోని ఆయా రాష్ర్టాల పంటలు, భవిష్యత్ దృష్ట్యా సీఎం కేసీఆర్ పామాయిల్ పంటను ప్రోత్సహించాలని నిర్ణయించారని మంత్రి తెలిపారు. ఒక్క ఎకరా వరికి అయ్యే నీరు, విద్యుత్తో నాలుగు ఎకరాల ఆయిల్పామ్ తోటలు పండించ వచ్చన్నారు. జాగ్రత్తలు వహిస్తే మూడున్నరేండ్లు దాటగానే పంట వస్తుందని, పంట ప్రారంభమైతే, సంవత్సరం పొడవునా గెలులు వస్తాయన్నారు. నెలవారి జీతాలు వచ్చే వారి కన్నా ఆయిల్పామ్ రైతలకు స్థిరమైన ఆదాయం వస్తుందని సూచించారు. రాష్ట్రంలో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలో సుమారు 59వేల ఎకరాల్లో ఆయిల్పామ్ తోటలు ఉన్నాయని వివరించారు. ఆయిల్పామ్ టన్నుకు రూ.22వేల ధర రైతుకు వస్తుందని, పెట్టుబడి ఖర్చుపోగా ఎకరానికి లక్షా 50వేల వరకు ఇవాళ లాభం వస్తుందన్నారు. ఇందులో కోకో పంటలు అంతర్ పంటలుగా వేసుకోవచ్చన్నారు. కోళ్లు, పశువులు పెంచుకోవచ్చని సూచించారు. ఈ పంట వేయడంతో తెలంగాణ రైతాంగంలో కొత్త మార్పులు సంభవిస్తాయన్నారు.
యాసంగి సీజన్ రైతుల పండించిన ప్రతీ ధాన్యం గింజను కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాన్ని రైతులు స్వాగతించారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా నిమిషం పాటు చప్పట్లు కొట్టారు. జై కేసీఆర్ అంటూ నినదించారు.
తెలంగాణ రైతులు ధనికులు కావన్నాదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎక్కువగా ఈ ప్రాంతం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందన్నారు. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి, గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేశారన్నారు. దీంతో ఈ ప్రాంత రైతులు బంగారు పంటలు పండిస్తున్నారన్నారు. ఇది గిట్టని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర నాయకులు రైతులపై కక్ష కట్టారన్నారు. పార్లమెంట్ సాక్షిగా తామంత ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తే, ప్రధాని పట్టించుకోలేదన్నారు. పైగా కేంద్ర మంత్రులు చులకనగా మాట్లాడారన్నారు. మన రైతులను మనమే కాపాడుకోవాలని చెప్పి, ఇవాళ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకొని, ధాన్యం చివరి గింజ వరకు కొంటామని ప్రకటించారన్నారు. సీఎం కేసీఆర్కు జిల్లా రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ రైతు ఆయిల్పామ్ సాగు చేసి, అధిక లాభాలను పొందాలని ఎంపీ సూచించారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఉద్యానవన శాఖ అధికారి రామలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ఎంపీపీ జాప అరుణ, జడ్పీటీసీ తడిసిన ఉమ, సర్పంచ్ అజీద్, ఎంపీటీసీ బాబు, నాయకులు జాప శ్రీకాంత్రెడ్డి, ఎడ్ల సోంరెడ్డి, వేముల వెంకట్రెడ్డి, రాగుల సారయ్య, దువ్వల మల్లయ్య, కిష్టారెడ్డి, జిల్లా నలుమూలల నుంచి రైతులు ప్రజాప్రతినిధులు తరలివచ్చారు.
– ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , మెదక్