Operation Safed Sagar | ప్రముఖ నటుడు సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా ఏరియల్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ (Operation Safed Sagar) వివాదంలో చిక్కుకుంది. 1999 కార్గిల్ యుద్ధంలో భారత సైన్యంతో కలిసి పోరాడిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారుల వీరోచిత గాథ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఓని సేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఆరు ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుండగా, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అయితే తాజాగా ఈ సిరీస్లోని ఒక సన్నివేశంపై ఆర్మీ వెటర్నరీ అధికారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
సిరీస్లో భాగంగా వీరమరణం పొందిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా (సిద్ధార్థ్ నటించిన పాత్ర) భౌతిక కాయంపై జాతీయ జెండాను కప్పిన విధానంపై భారత ఆర్మీ వెటర్నన్, శౌర్య చక్ర అవార్డు గ్రహీత కల్నల్ వెంబు శంకర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా’ నిబంధనల ప్రకారం శవపేటికపై త్రివర్ణ పతాకాన్ని తప్పుగా కప్పారని ఆయన పేర్కొన్నారు. శవపేటికపై జెండాలోని ఆకుపచ్చ భాగం కనిపించేలా తప్పుగా ప్రదర్శించారని, నిబంధనల ప్రకారం కాషాయ రంగు తల వైపు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ పొరపాటును సర్వీస్ హెడ్క్వార్టర్స్, మిల్యూటరీ అడ్వైజర్స్ ఎలా విస్మరించారంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మేకర్స్ వెంటనే ఈ తప్పును డిజిటల్గా సరిదిద్దాలని, అప్పటివరకు నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ ప్రసారాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ పొరపాటుపై మేకర్స్ మెయిన్స్ట్రీమ్ మీడియాలో బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కల్నల్ వెంబు శంకర్ కోరారు. ఈ సిరీస్లో సిద్ధార్థ్తో పాటు జిమ్ షెర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ అహుజా, తారూక్ రైనా తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. అభిజీత్ సింగ్ పర్మార్, కుశాల్ శ్రీవాస్తవ దీన్ని తెరకెక్కించారు. జాతీయ జెండా నిబంధనల వివాదం తెరపైకి రావడంతో మేకర్స్ దీనిపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.