Farmers | తొగుట, మార్చి 05 : సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గుడిగందుల గ్రామంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి మండిపడ్డారు. గుడిగందుల గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాలు కురిసి వారం రోజులు గడిచినా ఇప్పటికీ రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
పంటలు పూర్తిగా నష్టపోయిన రైతులను వెంటనే గుర్తించి, వారికి రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను అధికారులు వెంటనే అంచనా వేసి రైతులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
పంట నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. అదే విధంగా సిద్దిపేట జిల్లాను అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. రైతులకు అవసరమైన యూరియాను ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పర్శయ్య, భూపాల్ రెడ్డి, చంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.