మెదక్, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/రేగోడ్ : కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే కష్టాలు తొలుగుతాయని, జీవితాలు బాగుపడుతాయని అనుకున్న రైతులకు ఎదురుదెబ్బ తగులుతోంది. కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాంకు అధికారులు రైతులను వేధించిన సందర్భాలు ఎక్కడా లేవు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే రైతులను నానాతిప్పలు పెడుతున్నది. అంతేకాదు బ్యాంకులో తీసుకున్న రుణాలకు రైతులకు నోటీసులు ఇచ్చి బలవంతంగా వసూళ్లు చేస్తున్నది. తాజాగా మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని కొత్వాల్పల్లిలో మూడు రోజుల క్రితం రేగోడ్ ఏపీజీవీబీ అధికారులు గ్రామానికెళ్లి బ్యాంక్లో తీసుకున్న రుణాలు చెల్లించాలని దౌర్జన్యం చేసి, నోటీసులు ఇచ్చారు. బ్యాంక్ బకాయిలు కట్టాలి అనే ఫ్లకార్డులు పట్టుకొని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు రైతులతో మాట్లాడుతూ వడ్డీ చెల్లిస్తే ఇక్కడి నుంచి వెళ్తామని తెలుపగా, రైతులు ఒక్క పైసా కూడా కట్టమని, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలని కరాఖండిగా చెప్పారు. రుణమాఫీ డబ్బులు వచ్చేంత వరకు రుణాలు చెల్లించమని రైతులు సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ సర్కార్ వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించవద్దని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మీరొచ్చి రుణాలు చెల్లించాలని డిమాండ్ చేస్తే ఎలా అని రైతులు బ్యాంకు అధికారులను నిలదీశారు. రుణమాఫీతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే అవి మీకు ఇస్తాం అంతేకానీ.. తీసుకున్న రుణాలు కట్టాల్సిందేనని బ్యాంకు అధికారులు రైతులతో వాగ్వాదానికి దిగారు.
పంటలు పండిన తర్వాత అప్పులు చెల్లిస్తామని కొత్వాల్పల్లి గ్రామానికి చెందిన రైతులు బ్యాంకు అధికారులకు తెలిపారు. మీరు వచ్చి దౌర్జన్యంగా డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తే చెల్లించమని రైతులు తేల్చిచెప్పారు. మీ అప్పు కోసం మేము ఏమన్న తాగి చావాలా అని వాపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వస్తే రైతులకు ఇన్ని ఇబ్బందులు వస్తాయని అనుకోలేదని రైతులు అంటున్నారు. రూ.50వేలు తీసుకుంటే రూ.2 లక్షలు ఎలా అవుతాయని రైతులు బ్యాం కు అధికారులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేసేవరకు ఒక్క పైసా కూడా చెల్లించేది లేదని రైతులు బ్యాంకు అధికారులకు తెలిపారు.
పంటరుణం కట్టుమని మూడుసార్లు నోటీసులిచ్చారు. రుణం చెల్లించకపోతే కేసులు పెట్టి వసూలు చేస్తామని బ్యాంకు సిబ్బంది బెదిరించారు. పంట నష్టం జరిగి, గిట్టుబాటు ధరలేక మేము ఇబ్బం ది పడుతుంటే రుణం కట్టమని నోటీసులిచ్చి వేధింపులకు గురిచేయడం సరికాదు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పింది. అవి వచ్చేవరకు ఆగమని చెప్పినా అధికారులు వినిపించుకోవడం లేదు.
బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేకపోతున్నాం. పదేండ్ల నుంచి ఎన్న డూ లేనివిధంగా నోటీసులు కాకుండా ఇంటికొచ్చి రుణం చెల్లించాలని మనోవేదనకు గురిచేస్తున్నారు. వర్షాలకు పంట నష్టపోయి, ధరలేక ఎంతో కొంతకు అమ్ముకొని ఇబ్బంది పడుతున్నాం. రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా వినకుండా నోటీసులు ఇవ్వడం, ఇంటికొచ్చి బెదిరించడం మంచి పద్దతి కాదు.