గజ్వేల్/మనోహరాబాద్, ఏప్రిల్ 26: కాచిగూడ నుంచి కొడకండ్ల వరకు రైల్ కూత పెట్టింది. కాచిగూడ నుంచి మనోహరాబాద్ మీదుగా గజ్వేల్ మండలం కొడకండ్ల వరకు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును నడిపారు. కాచిగూడ నుంచి తూప్రాన్ మండలం మనోహరాబాద్కు 2.35 గంటలకు రైల్ చేరుకోగా, మనోహరాబాద్ నుంచి 2.45 గంటలకు ప్రారంభమై రూ.3.22కు గజ్వేల్ రైల్వేస్టేషన్కు చేరుకున్నది. మనోహరాబాద్ నుంచి కొడకండ్ల వరకు 43 కిలోమీటర్ల రైల్వేమార్గం పూర్తికావడంతో అతి త్వరలో ఈ మార్గంలో రైలు ప్రయాణం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంట్లో భాగంగా మంగళవారం కాచిగూడ నుంచి కొడకండ్ల వరకు, తిరిగి కొడకండ్ల నుంచి కాచిగూడ వరకు ప్రత్యేక రైలును నడిపారు. రైల్వేబోర్డు ఆదేశాలివ్వగానే అతిత్వరలో ఈ మార్గంలో గూడ్స్ , సాధారణ రైలు ప్రయాణ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే ఇంజినీరింగ్ అధికారి సోమనాథ్ తెలిపారు. రైలు వస్తుందన్న సమాచారం తెలుసుకున్న ప్రజలు అధికసంఖ్యలో రైలును చూడడానికి గజ్వేల్ స్టేషన్కు తరలివచ్చారు.
– వంటేరు ప్రతాప్రెడ్డి,ఎఫ్డీసీ చైర్మన్
సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజల చిరకాల వాంఛ అయిన రైలు ప్రయాణాన్ని సాకారం చేశారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం గజ్వేల్ రైల్వే స్టేషన్కు చేరుకున్న రైలులో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర ప్రజలతో కలిసి అధికారుల అనుమతితో కొడకండ్ల వరకు ప్రయాణించారు. అక్కడి నుంచి తిరిగి రైలులోనే గజ్వేల్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్లో రైల్వేస్టేషన్ ఏర్పాటుతో గజ్వేల్ పట్టణం మరింత అభివృద్ధి చెందనుందన్నారు. రైతులకు అవసరం అయ్యే ఎరువులు, విత్తనాలు తెచ్చుకోవడం, ఈ ప్రాంతం నుంచి పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి రైలుమార్గం ఉపకరిస్తుందన్నారు. వ్యాపార, వాణిజ్య అభివృద్ధికి దోహద పడనుందని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, కౌన్సిలర్ ఉప్పలమెట్టయ్య, రహీం, నాయకులు కిషన్రెడ్డి, దుర్గాప్రసాద్, పలువురు నాయకులు, పట్టణ ప్రజలు రైలులో ప్రయాణించారు.