హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంనుంచి అండగా నిలిచిన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరురోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోవడం ఎంతగానో కలచివేసిందని శుక్రవారం విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గులాబీ పార్టీ కోసం నిరంతరం నిబద్ధతతో, అత్యంత చిత్తశుద్ధితో పనిచేసిన సుదర్శన్రెడ్డి మృతి బీఆర్ఎస్కు, వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని పేర్కొన్నారు. తెలంగాణే శ్వాసగా, నీతి నిజాయితీకి నిలువుటద్దంలా ప్రజాజీవనం, రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన తీరు ఆదర్శప్రాయమని తెలిపారు.
పెద్దిని బతికించు కోవడానికి పార్టీ చేసిన విశ్వప్రయత్నం, వైద్యుల కృషి విఫలంకావడం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని వెల్లడించారు. తెలంగాణ మలి దశ పోరాటం, వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో కలిసి నడిచిన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. ఉద్యమకాలం నుంచి ఆఖరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన సైనికుడని కీర్తించారు. పోరాటాల ఖిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై గులాబీ జెండాను ఎగురవేసి, మొక్కవోని ధైర్యసాహసాలతో పోరాడిన వీరుడని శ్లాఘించారు. అటూ ‘ప్రత్యేక’ ఉద్యమం, ఇటు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలోనూ చెరగని ముద్రవేసుకొన్న పెద్ది, ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.
పెద్ది కుటుంబానికి గులాబీ పార్టీ అండ..
పోలీసు ఒత్తిళ్లు, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు లొంగని పెద్ది సుదర్శన్రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, నియోజకవర్గ అభివృద్ధికి చూపిన చొరవ, పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న తీరు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కేసీఆర్ పేర్కొన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి శోకాతప్త హృదయులైన భా ర్యాపిల్లలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో నర్సంపేట నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాల ని బీఆర్ఎస్ అధినేత ఉద్బోధించారు. సుదర్శన్రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు, పెద్ది కుటుంబసభ్యులు, ఆయనను నమ్ముకున్న వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.