మద్దూరు(ధూళిమిట్ట), జూలై20 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం నెలనెల పంచాయతీలకు నిధులను విడుదల చేస్తుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు.
మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై వెంటనే జిల్లా కలెక్టర్కు నివేదిక పంపాలని అదేవిధంగా మెమోలు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్గౌడ్ను ఎమ్మెల్యే ఆదేశించారు. అంతకుముందు వివిధ శాఖలపై అర్ధవంతంగా చర్చ సాగింది. రైతు బీమా కోసం కొత్తగా పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఏవో రామకృష్ణ అన్నారు.
ధూళిమిట్ట తహసీల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తూ వారి రిజిస్ట్రేషన్లు త్వరగా చేస్తూ సామాన్య రైతుల రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బైరాన్పల్లి ఎంపీటీసీ నర్సింహులు సమావేశం దృష్టికి తీసుకరాగా ఎమ్మెల్యే స్పందించి మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తానని తహసీల్దార్ను ఎమ్మెల్యే హెచ్చరించారు.
ఎంఈవో నర్సింహారెడ్డి కారణంగా తమ పాఠశాలలు మన ఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపిక కాలేదని గ్రామ సర్పంచ్ సుదర్శన్, ఎంపీటీసీ సమ్మయ్యలు అన్నారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని హామీనిచ్చారు. సమావేశంలో వైస్ఎంపీపీ సుమలత, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దార్లు నరేందర్, అశోక్, ఎంపీడీవో శ్రీనివాస్గౌడ్, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.