సిద్దిపేట, డిసెంబర్ 7( నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలకు చోటుదక్కింది. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం నుంచి దామోదర రాజనర్సింహా, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్రెడ్డి క్యాబినెట్లో దామోదర రాజనర్సింహాకు వైద్యారోగ్యశాఖ, పొన్నం ప్రభాకర్కు బీసీ సంక్షేమ శాఖలు కేటాయించారు. ఆరు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్రెడ్డి క్యాబినెట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి చోటు దక్కింది. దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం నుంచి దామోదర రాజనర్సింహ గెలుపొందారు. ఆయన బీఈ (సివిల్) చదివారు. కాంగ్రెస్లో వివిధ పదవులు చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్కమార్రెడ్డి మంత్రి వర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. తొలిసారిగా 1989లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో రెండో సారి గెలుపొంది, 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో మూడోసారి విజయం సాధించి వైఎస్ఆర్, రోశయ్య మంత్రి వర్గంలో పనిచేశారు. 2011లో కిరణ్కుమార్రెడ్డి మంత్రి వర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం దామోదర రాజనర్సింహకు వైద్యం, ఆరోగ్య శాఖను కేటాయించారు.
పొన్నంకు బీసీ సంక్షేమ శాఖ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ గెలుపొందారు. ఆయన బీఏ ఎల్ఎల్బీ చదివారు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. తొలిసారి కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పొన్నం ప్రభాకర్కు బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకునే బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్న ఇద్దరు మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్లపై మరింత గురుతర బాధ్యత ఉంది. ఇచ్చిన హమీలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. రైతులకు ఇచ్చిన రుణమాఫీ, యాసంగి సాగు ముమ్మరం అయిన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించాలి. ప్రధానంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు కృషి చేయాలని కోరుతున్నారు.