నాంపల్లి, ఆగస్టు 18 : మండల పరిధిలోని చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థ్ధులకు ఒకే టీచర్ ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన బాటపట్టారు. పాఠశాలలో మరో ఉపాధ్యాయుడిని నియమించాలంటూ మంగళవారం రోడ్డు పై బైఠాయించి ధర్నా చేపట్టారు. సంవత్సరం క్రితం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న రెండో ఉపాధ్యాయురాలు డిప్యుటేషన్పై రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తూ జీతం మాత్రం ఇకడే తీసుకుంటోందన్నారు.
ఐదు తరగతులకు ఇద్దరు టీచర్లే ఉన్నప్పుడు రెండో టీచర్ను డిప్యుటేషన్పై వేరే జిల్లాకు ఎలా పంపిస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. అధికారులకు చేతులు తడపడం వల్లనే ఆమెను వేరే జిల్లాకు డిప్యుటేషన్పై పంపించారని గ్రామస్తులు ధ్వజమెత్తారు. సమస్యను ఎన్నోసార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించడంతో నాంపల్లి సీఐ దూది రాజు, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు.