సిద్దిపేట : జిల్లాలోని దుద్దేడ వద్ద నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనం, పోలీస్ కమిషనరేట్ భవనాన్ని జూన్ రెండవ వారంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి. హరీష్ రావు బుధవారం తెలిపారు. ఈ రెండు భవనాల పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు ఫర్నిచర్ సదుపాయాన్ని కల్పించాలన్నారు.
అదేవిధంగా మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. పార్కింగ్ కోసం స్థలం కేటాయించాలన్నారు. ఈ రెండు భవనాల్లోని పెండింగ్ పనులను రెండు రోజుల్లో పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి, పోలీసు కమిషనర్ డి. జోయెల్ డేవిస్, తదితరులు పాల్గొన్నారు.