చేర్యాల, మే 13 : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నది. అంతే కాకుండా దేశ ప్రజల పై ధరల భారం మోపుతుండడంతో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ధర్మపోరాటం సాగిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన రూ.45లక్షల వ్యయంతో చేపట్టే పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం ఉమారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు విద్యాలయాలలో మౌలిక వసతులు కల్పించి పిల్లలకు ఉత్తమ బోధన అందించేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిదన్నారు. ఇక బడులన్నీ గుడులుగా మారుతాయన్నారు.
అరుగాలం కష్టం చేసి వడ్లు పండించిన తెలంగాణ రైతుల పై బీజేపీ ప్రభుత్వం కక్ష గట్టిందని, వడ్లు కొనుగోలు చేస్తున్న రైస్మిల్లుల పై దాడులు చేయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు బండి సంజయ్, కిషన్రెడ్డి, రేవంత్రెడ్డిలు తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని, లేని పక్షంలో టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడిక్కడ అడ్డుకుంటారన్నారు.
కార్యక్రమాలలో సర్పంచ్ కొమ్ముల స్వప్న, డీఆర్డీఏ పీడీ గోపాల్రావు,ఎంపీటీసీ గదరాజు యాదగిరి,ఎస్ఎంసీ చైర్మన్ శివశంకర్, కోఆప్షన్ సభ్యుడు నాజర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, తాళ్లపల్లి రమేశ్, తదితరులు పాల్గొన్నారు.