గజ్వేల్, జనవరి 3: యాసంగి పనుల్లో రైతులు బిజీబిజీగా గడుపుతున్నారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా రైతులు నాట్లు వేసేందుకు పొలాలను దున్నుకుని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నారుమడులు వేసిన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సంక్రాంతి తరువాత వరి నాట్లు వేస్తే సకాలంలో పంట చేతికొస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనుకున్న సమయానికి వరి నాట్లను వేస్తే ఫలితం బాగుంటుందని అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు.
గజ్వేల్, ములుగు వ్యవసాయ డివిజన్లలో వరి నాట్లతోపాటు ఆరు తడి పంటలు సాగు చేస్తారు. ములుగు, వర్గల్, మర్కూక్ మండలాల్లోని ఆయా గ్రామాల రైతులు అధికంగా ఆరు తడి పద్ధతిలో కూరగాయ పంటలు సాగు చేస్తారు. మిగతా మండలాల్లోని రైతులు వరి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలు సాగుచేస్తారు. చాలావరకు రైతులు ఇప్పటికే వరి నారు పోయడంతో నాటు వేసుకునేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. బోరుబావుల ఆధారంగా పంటలు సాగు చేసే రైతులు ఎక్కువగా ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వం ఏటా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కూడవెల్లి, హల్దీ వాగుల్లోకి వదలడంతో రైతులు సాగు చేసిన వరి పంటకు న్యాయం చేకూరేది. గ్రామాల్లోని చెరువులు, కుంటలను ఈ నీటితో నింపేవారు. ఈ ఏడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏడాది వ్యవధిలోనే సాగు ఖర్చులు పెరిగాయి. గతేడాదికీ ఇప్పటికీ చూస్తే సాగులో ఖర్చు పదిశాతం పెరిగింది. గతంలో ఎకరం పొలం దున్నేందుకు ట్రాక్టర్కు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు తీసుకునేవారు. వరి నాటేందుకు కూలీ ఒక్కరికి రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎకరం గుత్తా చొప్పున రూ.5 వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చు అవుతున్నది. కూలీల కొరత కారణంగా చాలావరకు గ్రామాల నుంచి ఆటోల్లో తీసుకెళ్లాల్సి వస్తున్నది. ఇక గ్రామాల్లో ఒకరి తరువాత మరొకరి పొలం నాటు వేసేందుకు ఒప్పందాలు చేసుకుంటారు. కొద్ది రోజుల్లోనే వరినాట్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో కూలీలకు డిమాండ్ బాగానే ఉంటుంది.