సిద్దిపేట, జూన్ 21 : ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేటలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన సుదర్శన హోమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో వేదపండితుల పాత్ర అనీర్వచనీయమన్నారు. జిల్లాలో నూతనంగా 171 దేవాలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేడు సిద్దిపేట అంటే ఆధ్యాత్మికం, అభివృద్ధి, విద్యాక్షేత్రం, ఉపాధి కేంద్రంగా మారిందన్నారు. ఆలయాలకు నిధులు మంజూరు చేసి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ వల్లనే నేడు ఆధ్యాత్మికతకు గొప్ప వైభవం వచ్చిందన్నారు. సిద్దిపేటలోనే తెలంగాణ ఉద్యమానికి, ధార్మికత, ఆధ్యాత్మికతకు పునాది వేశామన్నారు. ఆంధ్రప్రదేశ్లో విచ్ఛిన్నమస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రాప్తిరస్తూ అనే బ్రాహ్మణుల వేదవాక్.. ఆశీర్వాద ఫలితం నేడు రాష్ట్ర ఆవిర్భావమన్నారు.
పదేండ్ల క్రితం ఆధ్యాత్మిక మాట విన్నా మా.. శతాబ్దపు చరిత్ర గల ఆలయాలను దశాబ్ద కాలంలోనే గొప్ప వైభవాన్ని తీసుకువచ్చామన్నారు. ఆలయాల వైభవానికి నాటి యాదగిరి గుట్టనే.. నేటి యాదాద్రి అన్నారు. కొండగట్టు అం జన్న ఆలయ అభివృద్ధికి రూ.600 కోట్లు మం జూరు చేసుకున్నామన్నారు. వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధి కోసం రూ.100 కో ట్ల చొప్పున కేటాయించుకున్నామన్నారు. రాష్ట్రం నుంచి కాశీ వెళ్లే భక్తుల సౌకర్యార్థం 60 వేల చదరపు అడుగుల్లో అక్కడ వసతి గృహం నిర్మించబోతున్నదన్నారు. శబరిమల దర్శనం కోసం వెళ్లే తెలంగాణ భక్తుల కోసం అక్కడ మరో వసతి గృ హం నిర్మిస్తున్నామన్నారు. నాడు సిద్దిపేట మొదలైన బ్రాహ్మణ పరిషత్ నేడు హైదరాబాద్లో ఏర్పాటైన బ్రాహ్మణ సదనానికి స్ఫూర్తి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకం కింద అర్చకులకు రూ.2500 మాత్రమే ఇచ్చేదని, తెలంగాణ ఏర్పడిన ధూపదీప నైవేద్యం పథకాన్ని ఇటీవల రూ. 6వేల నుం చి రూ.10వేలు చేసిన గొప్ప ధార్మిక దార్శనికుడు బ్రాహ్మణ బాంధవుడు సీఎం కేసీఆర్ అన్నారు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట అర్చకులు ప్రభుత్వ నుంచి వేతనాలు ఇవ్వాలని నిరసన చేస్తూ హోమం నిర్వహించారని తెలిపారు.
నాడు దేశంలో తొలి బ్రహ్మణ పరిషత్ సిద్దిపేటలోనే ఏర్పాటైందన్నారు. దేశంలో తొలి విప్రహిత బ్రాహ్మణ సదనం రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.100కోట్లు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు కేటాయించామన్నారు. జిల్లాలో 135 ఆలయాలను 100కోట్లతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. రాష్ర్టానికే తలమానికమైన భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి మల్లన్న కొలువైన ప్రాంతం సిద్దిపేట అన్నారు. కాళేశ్వరం నుంచి మొదలు పెడితే కొండపోచమ్మ వరకు దేవుళ్ల పేరుతో రిజర్వాయర్లు నిర్మించుకున్నామన్నారు. గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్న కాళ్లు కడిగిన చరిత్ర సీఎం కేసీఆర్దేనన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలయాలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఆలయాలను చిన్నచూపు చూశారని, మన దేవుళ్ల ప్రాధాన్యత తగ్గించారన్నారు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ ఆలయాల కీర్తి ఇనుమడించిందన్నారు. మతం పేరిట మాటలు చెప్పే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాలు, అర్చకులకు ఒక్క రూపాయి ఇచ్చింది లేదని, ఇతర రాష్ర్టాల్లో కూడా ఇదే పరిస్థితి అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సు డా చైర్మన్ రవీందర్రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.