Sheri Subhash Reddy | మెదక్ రూరల్, డిసెంబర్ 9 : సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు ప్రజలు మరోసారి మోసపోవద్దని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పిలుపు నిచ్చారు. హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని కూచన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గొల్ల బోయిన మౌనిక, వార్డ్ సభ్యులు స్థాననికి బరిలో ఉన్న అభ్యర్థుల, తరుపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ఓట్లను దండుకొని..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలను ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం రెండేళ్లలో గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల క్రితం మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజల ఓట్లను దండుకొని ఆ తర్వాత మొండి చేయి చూపిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో వాగ్ధానం చేసిన ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఈ సర్పంచ్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటేసి బారీ మెజార్జీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో మాజీ ఎంపీపీ నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి సుభాష్ రెడ్డి, రామ్ రెడ్డి, లింగంపల్లి శేఖర్ రెడ్డి, కిష్టా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
