అమీన్పూర్, మార్చి 07: యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డి పేట గ్రామంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఫ్రెండ్లీ యూత్ అసోసియేషన్ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు పోటీలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత తరుణంలో యువత కేవలం చదువులపై మాత్రమే దృష్టి పెడుతున్నారని.. కానీ క్రీడల పట్ల కూడా ఆసక్తిని పెంపొందించుకుని చురుగ్గా క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు కావల్సిన సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు.
క్రీడాకారులు తమకు లభించే అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఉన్న ఊరుకు, రాష్ర్టానికి పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఈ పోటీలను నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.