సంగారెడ్డి : తన మేక ఆకలిని తీర్చే యత్నంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కోహీర్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం చోటుచేసుకొంది. ఎస్ఐ చల్లా రాజశేఖర్ కథనం ప్రకారం..కోహీర్లోని ఎక్కల్దేవి కుంట కాలనీకి చెందిన అంతారం రాజు(26) మేకకు అవసరమయ్యే మేత సేకరణలో భాగంగా బావి సమీపంలోని చెట్టు కొమ్మలను విరుస్తుండగా అకస్మాత్తుగా కాలుజారింది.
దీంతో అతడు బావిలో పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు చికిత్స కోసం జహీరాబాద్ దవాఖానకు తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తండ్రి అంతారం రత్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.