civil Judge Sowjanya | ఝరాసంగం, ఏప్రిల్ 22: చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారానే నేర రహిత, సురక్షిత సమాజాన్ని నిర్మించవచ్చని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ సౌజన్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణం కోసం సమాజంలో మార్పు రావాలంటే కేవలం చట్టాలు ఉండటం సరిపోదని, వాటి గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయడం కూడా అంతే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పనిచేసే క్షేత్రస్థాయి అధికారులు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామ కార్యదర్శులు, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య కీలక వారధులని, వారు చట్టాలపై పూర్తి అవగాహనతో పనిచేయాలని సూచించారు. బాల్య వివాహాలు బాలల హక్కులను కాలరాయడమేనని, వీటిని అరికట్టడంలో గ్రామ పెద్దలు, మహిళా సంఘాల పాత్ర కీలకమని తెలిపారు.
బాల్యం చదువుకే పరిమితం కావాలని, పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని స్పష్టం చేశారు. పోక్సో (POCSO)చట్టం, పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే ఈ చట్టం గురించి క్షుణ్ణంగా వివరించారు. బాధితులకు అందాల్సిన న్యాయం, అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జడ్జి సౌజన్య కోరారు.
ఈ సదస్సులో ఎంపీడీవో, ఎంపీవో, సీడీపీవో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Kailsas Bapu Kote | కుమార్తె కలుగాలన్న ఆశ నెరవేరకపోవడంతో ఆ దంపతులు ఏం చేశారో తెలుసా..?
Telangana High Court | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే!