Kasturba Gandhi School | ఝరాసంగం, సెప్టెంబర్ 08 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ కోసం పలు రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, కింది స్థాయి అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల అస్తవ్యస్తంగా తయారైంది. ఆకస్మిక తనిఖీకి వచ్చిన అధికారులే అక్కడి సమస్యలను చూసి అవాక్కయ్యారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు, ఎంపీడీవో మంజుల, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామారావు, సాయి సిబ్బందితో కలిసి పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
నిర్వహణ లోపం ఉండడంతో పాఠశాల ప్రత్యేక అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది విద్యార్థులకు విష జ్వరాలు వచ్చినా పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల ఆవరణంలో ఉన్న సంపు లీకై ఆవరణ అంతా మురుగునీరు నిండడంతో ఆవరణ మొత్తం దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో పాఠశాల పరిసరాలన్నీ ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తూ అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది.
పాఠశాల వంటగదిని పరిశీలించగా మునిగిపోయిన ఎలుకలు కొరికిన టమాటాలు, కుళ్లిపోయిన అరటి పండ్లు, బియ్యంలో పురుగులు దర్శనమిచ్చాయి. సమస్యలను చూసిన అధికారులే అవాక్కయ్యారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని మండల వైద్యాధికారి రమ్యను ఆదేశించడంతో సిబ్బందితో కలిసి ఆవరణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను జిల్లా ఉన్నత అధికారులకు నివేదిక అందిస్తామని డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావు తెలిపారు. ఇదిలా ఉంటే విద్యార్థులకు జ్వరాలు రావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.