పటాన్చెరు, జనవరి 6: గరీబులకు రూ.600 కోట్ల విలువైన ఇండ్ల పట్టాలను 58 జీవో ద్వారా అందజేస్తున్నాం. సీఎం కేసీఆర్ పేదల గూడు చెదరనివ్వలేదు. కాంగ్రెస్ హయాంలో భయంభయంగా కట్టుకున్న చిన్నపాటి ఇంట్లో జీవించిన మీకు ఇప్పుడు ఇండ్ల పట్టాలను ఉచితంగా ఇచ్చి యజమానులను చేశాం. రూపాయి ఖర్చు లేకుండా పారదర్శకంగా మీకు రూ.10 నుంచి రూ.20 లక్షలు విలువ చేసే ప్లాట్ను రెగ్యులరైజ్ చేశాం. ఇప్పుడు మీ పిల్లలతో మీరు నిశ్చింతంగా మీ ఇంట్లో ఉండండి అంటూ వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన 58 జీవో పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 58 జీవోలో ఇప్పటికే ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పర్చుకున్న పేదలకు ప్లాట్లు ఇచ్చి రెగ్యులరైజ్ చేశారు.
లబ్ధిదారులకు మంత్రి ఇంటి పట్టాలు ఇవ్వడంతో వారు సంతోషం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రెవెన్యూ యంత్రాంగం 58 జీవోలో 738 పట్టాలు అందజేయడం అభినందనీయమన్నారు. పూర్తిగా పారదర్శకంగా జరిగిన ఈ పట్టాల పంపిణీ ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధిక పేదలు లబ్ధి పొందారన్నారు. ఇప్పటికే దాదాపు రూ.600 కోట్ల విలువైన భూమిలో పేదలు ఇండ్లు నిర్మించుకున్నందుకు 58 జీవోలో రెగ్యులరైజ్ చేశామన్నారు. పటాన్చెరు నియోజకవర్గం తెలంగాణలోనే అత్యధిక రెగ్యూలరైజ్ అయిన ప్రాంతంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పేదలు కట్టుకున్న చిన్నపాటి ఇండ్లకు పట్టాలిప్పించారని కొనియాడారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి నిరంతరం ఆలోచిస్తారన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో పేదలు ఇండ్లు కట్టుకుంటే జేసీబీలతో కూల్చేవారని గుర్తు చేశారు. కట్టుకున్న ఇంట్లో బిక్కుబిక్కుమని భయంతో ఉండేవారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రాగానే ఇలా భయంతో ఉన్నవారికి అభయం ఇచ్చి 58 జీవోతో రెగ్యులరైజ్ చేశామని తెలిపారు.
ఇప్పుడు పేదలందరూ తమ బీఆర్ఎస్ సర్కార్ను అభినందిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఏ పనిచేసినా అది పేదల సంక్షేమానికి, వారి అభివృద్ధికి మాత్రమే ఉంటుందన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే దిశగా శ్రమిస్తున్నారన్నారు. కట్టిన ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తామని తెలిపారు. సురక్షితమైన తాగునీరు అందజేసి కాలుష్యం నీటినుంచి కాపాడామన్నారు. నియోజకవర్గంలో 13 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి పేదల ఆరోగ్యాలను కాపాడుతున్నామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా నిలిచామన్నారు. దవాఖానలో ఉచిత కాన్పులు చేయిస్తున్నామన్నారు. పుట్టిన బిడ్డలను సంరక్షిస్తూ కేసీఆర్ కిట్లను ఇస్తున్నామన్నారు. తల్లీబిడ్డలను ఇంటిదాక వదులుతున్న సర్కార్ మాదన్నారు. త్వరలోనే 59 జీవోలో అప్లికేషన్స్ వేసిన వారికి పట్టాలను పంపిణీ చేస్తామని మంత్రి హామీయిచ్చారు. డబుల్ బెడ్రూమ్లను అందజేస్తామని తెలిపారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న మంచి పనులు కండ్లారా చూస్తూ ఆయన్ను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీపై ఉందని మంత్రి హరీశ్రావు అన్నారు.కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సంగారెడ్డి కలెక్టర్ శరత్కుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, బక్కి వెంకటయ్య, జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మశ్రీ, ఈర్ల దేవానంద్, వినయ, జడ్పీటీసీలు సుప్రజ, సుధాకర్రెడ్డి, కుమార్గౌడ్, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, లలితా, రోజా, కార్పొరేటర్లు పుష్ప, సింధు, మెట్టుకుమార్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, చంద్రారెడ్డి, అంతిరెడ్డి, రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంకటేశంగౌడ్, ఆదర్శ్రెడ్డి, నగేశ్, గూడెం మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, మెరాజ్ఖాన్, బీ.పాండు, బీ.వెంకట్రెడ్డి, దశరథరెడ్డి, అఫ్జల్, పరమేశ్, యూనుస్, డీఎస్పీ భీంరెడ్డి, తహసీల్దార్ పరమేశం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు- మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
జీవో నెంబర్ 58ను అమలు చేస్తూ పేదలకు ఇంటి యజమానిని చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. దేశంలోని అనేక రాష్ర్టాల నుంచి వచ్చిన నిరుపేదలు అప్పుసప్పో చేసి అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అలా నిర్మించుకున్న నిర్మాణాలకు సీఎం కేసీఆర్ పెద్ద మనసు చేసుకుని 58 జీవో ద్వారా క్రమబద్ధీకరించడం అభినందనీయం. పటాన్చెరు ప్రాంతంలో వేలాది మందికి పట్టాలు ఇచ్చిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉంది. ఇది పక్కాగా పేదల ప్రభుత్వం. మీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మీ సంక్షేమానికి చేస్తున్న కృషి అభినందనీయం.
గరీబుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు నియోజకవర్గం అంటేనే మినీ ఇండియా. ఇక్కడ ఉపాధికోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించాం. ప్రభుత్వ భూముల్లో కట్టుకున్న ఇండ్లను కూల్చకుండా కాపాడినం. సీఎం కేసీఆర్ పెద్ద మనసు చేసుకుని 58జీవోతో వారిని ఆదుకుంటున్నారు. అర్హులకు పట్టాలు ఇస్తున్నాం. 738మందికి పట్టాలు ఇచ్చి జిల్లాలోనే ముందున్నాం. రెండు విడుతల్లో ఇప్పటికే 6వేల సర్టిఫికెట్లు ఇచ్చాం. దాని విలువ దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది. పేదలపై ప్రేమ ఉండడంతోనే మేము మీకు ఖర్చుకు వెనుకాడకుండా పట్టాలిచ్చాం. మంత్రి హరీశ్రావు సహకారంతో పేదలకు సంక్షేమ ఫలాలను అంతరాయం లేకుండా అందిస్తున్నాం. త్వరలో 59 జీవోను క్రమబద్ధీకరించి సర్టిఫికెట్లు ఇవ్వబోతున్నాం. మా ప్రభుత్వం ఏది చేసినా అది ప్రజల సంక్షేమం కోసమేనని అర్థం చేసుకోవాలి. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి.