Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సోమవారం లాభాల్లో ముగిసినప్పటికీ.. మంగళవారం నష్టాల బాటలోనే సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయింది. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లోనే ప్రారంభమైంది. సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే ఉదయం సెన్సెక్స్ 320 పాయింట్లు తక్కువగా 78,204 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో 24,490 వద్ద ప్రారంభమైంది. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 388.19 పాయింట్ల (0.49 శాతం) నష్టంతో 78,154.25 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 112.10 పాయింట్లు (0.46 శాతం) నష్టంతో 24,471.70 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్ మాత్రం మిశ్రమ ఫలితాల్ని సాధించింది. బీఎస్ఈ మిడ్క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.02 పాయింట్లు (0.01 శాతం) నష్టపోగా, బీఎస్ఈ స్మాల్క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 34.63 పాయింట్లు (0.38 శాతం) లాభాలు పొందింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.17 శాతం నష్టపోయింది. నిఫ్టీ రియాల్టీ 1 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా మాత్రం 1.02 శాతం లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్లో టైటాన్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎటర్నల్ లాభపడ్డాయి. ఎటర్నల్ అత్యధికంగా 2.01 శాతం లాభపడింది. మరోవైపు భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ సంస్థలు నష్టాల్లో ముగిశాయి.
ముఖ్యంగా అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థ 2.75 శాతం నష్టపోయింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో ట్రేడింగ్ నష్టాల్లో ముగిసింది. డాలర్తో రూపాయి మారక విలువ మరింత బలపడింది. మంగళవారం 15 పైసలు తగ్గిన రూపాయి 95.43 వద్ద కొనసాగుతోంది. ఉదయం 95.38 వద్ద ఓపెన్ కాగా, మధ్యలో 95.37కు చేరింది. చివరకు 95.43 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.13 శాతం తగ్గి, 87.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.