అమరావతి : వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ( Liquor Scam ) లో కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్ మోహన్రెడ్డే ( YS Jagan ) నని మంత్రి కొలుసు పార్థసారథి ( Minister Parthasarathi ) ఆరోపించారు. ఈ విషయంలో రూ.4 వేల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మద్యం కుంభకోణం విషయం జగన్ ఎందుకు మాట్లాడరని విమర్శించారు. వైసీపీ, జగన్ దృష్టిలో డీఎస్సీ అంటే డ్రగ్స్, శాండ్, చీప్ లిక్కరని అభివర్ణించారు. కుంభకోణంలో నిందితుల్లో ఒకరైన సత్యనారాయణ అప్రూవర్గా మారడంతో అతడికి మతిస్థిమితం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని వైసీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ అక్రమాలతో కూడిన మద్యం పాలసీని తీసుకొచ్చిందని విమర్శించారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ అనుకూలంగా మార్చుకుని నిర్వీర్యం చేశారని వెల్లడించారు. వైసీపీ తెచ్చిన మద్యం బ్రాండ్ల వల్ల 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెగిపోయాయని తెలిపారు.
మెగా డీఎస్సీలో 16,500 టీచర్ ఉద్యోగాలు ఇస్తే అక్రమాలు జరిగినట్లు జగన్ అసత్య ప్రచారం చేశారని దుయ్యబట్టారు. అసత్య ప్రచారాలను అధికారులు ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నా ప్రభుత్వంపై బురద చల్లేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.