RBI Governor : కృత్రిమ మేథ (Artificial Intelligence) వినియోగంలో బ్యాంకులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) స్పష్టంచేశారు. ‘ఏఐ’ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి పూర్తి జవాబుదారీతనం బ్యాంకులదేనని, పొరపాటు జరిగినప్పుడు ఏఐ మోడళ్లను నిందించడం ఆమోదయోగ్యం కాదని గట్టిగా హెచ్చరించారు.
మంగళవారం ముంబైలో ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఫైబాక్ 2026’ సదస్సులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా నిర్ణయం విషయంలో అంతిమ బాధ్యత బ్యాంకుదే తప్ప, సేవలు అందించిన వెండార్ది, అల్గారిథమ్ది కాదని మల్హోత్రా స్పష్టంచేశారు. ‘ఈ నిర్ణయం తీసుకున్నది మోడల్ అని చెప్పడం సమర్థనీయం కాదు. రెగ్యులేటర్గా మేము కానీ, కస్టమర్లు కానీ ఇటువంటి సమాధానాలను ఎప్పటికీ అంగీకరించం’ అని ఆయన తేల్చి చెప్పారు.
మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా కాకుండా దానికి అదనపు తోడ్పాటునిచ్చే సాధనంగా మాత్రమే ఏఐని వినియోగించుకోవాలని సూచించారు. ఏఐ అందించే సిఫార్సులను విశ్లేషించగలగడం, అవసరమైనప్పుడు జోక్యం చేసుకుని వాటిని సవరించగలగడం వంటి పటిష్టమైన మానవ పర్యవేక్షణ వ్యవస్థలో అంతర్భాగంగా ఉండాలని మల్హోత్రా నొక్కిచెప్పారు. ప్రతి బ్యాంకు బోర్డు ఆమోదించిన నిర్దిష్ట ఏఐ విధానాన్ని కలిగి ఉండాలని, థర్డ్-పార్టీల నుంచి సేవలు పొందినప్పటికీ ఫలితాలకు బ్యాంకులే జవాబుదారీగా ఉండాలని స్పష్టంచేశారు.
కస్టమర్ సేవలను మెరుగుపరచడం, జీఎస్టీ ఫైలింగ్స్, డిజిటల్ ఫుట్ప్రింట్స్ వంటి డేటా ఆధారంగా రుణ సదుపాయాలను విస్తరించడం, మోసాలను గుర్తించడం వంటి అంశాల్లో ఏఐకి అపారమైన సామర్థ్యం ఉందని గవర్నర్ పేర్కొన్నారు. అదే సమయంలో మోడల్ పక్షపాతం, డేటా గోప్యత, సైబర్ భద్రతా ముప్పులపట్ల బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏఐ ద్వారా జరిగే మోసాలను అడ్డుకోవడానికి కూడా తిరిగి అదే ఏఐ సాంకేతికతను ఆయుధంగా వినియోగించుకోవాలని సూచించారు.