సంగారెడ్డి, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఆదేశాలతో అటవీశాఖ అధికారులు ఎనిమిదో విడుత హారితహారానికి సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెంచాలన్న లక్ష్యంతో ప్రభు త్వం హరితహార కార్యక్రమాన్ని అమ లు చేస్తున్నది. హరితహారంలో భాగంగా అటవీ ప్రాంతాలు, గ్రామాలు, పొలం గట్లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో ఏడు విడుతలుగా హరితహారం కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలో అధికార యంత్రాంగం అన్నివర్గాల ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేసింది. 2015 నుంచి 2021 వరకు మొత్తం 8 కోట్లకు పైగా మొక్కలు నాటారు. 2021లో అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థతోపాటు ఇతర శాఖలు అన్ని కలిపి మొత్తం 54.33 లక్షల మొక్కలు నాటారు. వచ్చే ఏడాది ఎనిమిదో విడుత హరితహారం విజయవం తం చేసేందుకు అధికారులు ఇప్పటి నుంచి సన్నద్ధమవుతున్నారు. రాబోయే మూడేండ్లపాటు హరితహారంలో మొక్కలు నాటేందుకు లక్ష్యాలను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అటవీశాఖ అధికారులు 2022, 2023, 2024 సంవత్సరంలో నాటాల్సిన మొక్కల లక్ష్యాలను సిద్ధం చేసుకున్నారు. శాఖలవారీగా కేటాయింపులు పూర్తి చేశారు. 2022 (ఎనిమిదో విడుత హరితహారం)లో 46.06 లక్షలు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023లో 40.76 లక్షలు, 2024లో 35.46 లక్షల మొక్కలు నాటనున్నారు. వచ్చే ఏడాది 2022 హరితహారం కోసం ఇప్పటి నుంచి నర్సరీలను సిద్ధం చేస్తున్నారు.
ఈ ఏడాది 54.33 లక్షల మొక్కలు నాటారు…
2021లో హరితహారంలో భాగంగా సం గారెడ్డి జిల్లావ్యాప్తంగా 54,33,445 మొక్క లు నాటారు. ఈ ఏడాది 57 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 96 శాతం లక్ష్యం సాధించారు. 57 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా, వివిధ ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీల్లో 54,33,445 మొక్కలు నాటారు. వ్యవసాయశాఖ 12,999 మొక్క లు, గ్రామీణాభివృద్ధి సంస్థ 38,92,706 మొక్కలు, ఎక్సైజ్శాఖ 53,400 మొక్కలు, అటవీశాఖ 5,71,859 మొక్కలు, ఉద్యానవశాఖ 58,100 మొక్కలు, పరిశ్రమలశాఖ 50,150 మొక్కలు, జాతీయ రహదారుల సంస్థ 7729 మొక్కలు నాటింది. వీటితోపాటు అందోల్ మున్సిపాలిటీలో 38,821 మొక్కలు, అమీన్పూర్లో 98261, బొల్లా రం 65615, నారాయణఖేడ్లో 33925, సదాశివపేటలో 66561, సంగారెడ్డిలో 2,80,388, తెల్లాపూర్లో 67,868, జహీరాబాద్లో 1,34,925 మొక్కలు నాటారు.
వచ్చే ఏడాది 46.06 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
ఎనిమిదో విడుత హరితహారం (2022)లో 46,06,500 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటవీశాఖతోపాటు అన్ని ప్రభుత్వశాఖలు, మున్సిపాలిటీలకు హరితహారం లక్ష్యాలను కేటాయించారు. 2022లో వ్యవసాయశాఖ 1000 మొక్కలు, గ్రామీణాభివృద్ధి సంస్థ 28 లక్షలు, దేవాదాయశాఖ 1000 మొక్కలు, ఎక్సైజ్శాఖ లక్ష మొక్కలు, అటవీశాఖ 5 లక్షల మొక్కలు, వ్యవసాయశాఖ లక్ష మొక్కలు, పరిశ్రమల శాఖ లక్ష మొక్కలు, పోలీస్ శాఖ 25 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ రహదారుల సంస్థ లక్ష మొక్కలు, విద్యాశాఖ 5 వేల మొక్కలు, పశుసంవర్ధకశాఖ 1000 మొక్కలు, జైళ్లశాఖ 1000, మహిళా శిశు సంక్షేమశాఖ 1500 మొక్కలు, సంక్షేమశాఖ తరఫున 1000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు సంగారెడ్డి జిల్లాలోని అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలోని నర్సరీల్లో 50 లక్షలకు పైగా మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే హరితహారంలో భాగంగా 2023లో 40.76 లక్షలు, 2024లో 35.46 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
లక్ష్యం మేరకు మొక్కలు నాటుతాం
హరితహారంలో భాగంగా రాబోయే మూడేండ్లకు సంగారెడ్డి జిల్లాలో మొక్కలు నాటేందుకు లక్ష్యాలను సిద్ధం చేసుకున్నాం. 2022లో 46.06 లక్షలు, 2023లో 40.76 లక్షలు, 2024లో 35.46 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రా బోయే ఏడాది ఎనిమిదో విడుత హరితహారంలో 46.06 లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించాం. లక్ష్యం మేరకు అన్ని ప్రభుత్వశాఖలు, మున్సిపాలిటీల్లో మొక్క లు నాటేలా చర్యలు తీసుకుంటాం. వచ్చే ఏడాది వందశాతం మొక్కలు నాటే లక్ష్యంతో ఇప్పటి నుంచి సన్నద్ధమవుతున్నాం. నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాం.
-వెంకటేశ్వర్లు, డీఎఫ్వో, సంగారెడ్డి