జహీరాబాద్, ఏప్రిల్ 15: ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు జహీరాబాద్ నియోజవర్గంలోని గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండల పట్టణాల్లో ముఖ్యనాయకులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్ రావు వరంగల్ సభను విజయవంతం చేసేలా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి పల్లె నుంచి వెళ్లడానికి నాయకులు గ్రామస్థాయిలో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సభను విజయంవతం చేసేలా జహీరాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు వాల్ రైటింగ్స్ రాసి ప్రారంభించారు.
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న జనాలు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం ఇతర పథకాల అర్హులైన వారికి అందుకే పోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సభకు గ్రామాల నుంచి జనం వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. నియోజక వర్గం లో బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాయకులు పార్టీ వెన్నంటే ఉంటూ అధిష్టానం సూచనల మేరకు ప్రభుత్వ వ్యతరేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంటి పండగల భావించి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వెళ్ళేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు నామ రవి కిరణ్, యాకూబ్, మొహీ జుద్దీన్ తదితరులు పాల్గొన్నారు