గుమ్మడిదల,ఆగస్టు29 : దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ దళిత బాంధవుడయ్యారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అనంతారం గ్రామానికి చెందిన 12 మందికి దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గతంలో దళితులు కూలీ పనులు చేసుకుంటు బతుకుదెరువు కొనసాగిస్తున్న వారు నేడు స్వరాష్ట్రంలో యాజమానులుగా నెలదొక్కుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
దళితబంధు ద్వారా ఉపాధి పొందుతూ నేడు దళితులు మరో కొంత మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.