Child Marriages | నర్సాపూర్, నవంబర్ 12 : బాల్య వివాహాలు జరుగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని డీడబ్ల్యూవో హేమభార్గవి సూచించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని రైతువేదికలో మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన, పిల్లలు, అభివృద్ధిపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీడబ్ల్యూవో హేమభార్గవి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు జరుగకుండా గ్రామాలు, తండాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగితే అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్యదర్శులదే బాధ్యతని హెచ్చరించారు. మెదక్ జిల్లాను బాల్యవివాహాలు జరగని జిల్లాగా మార్చాలని తెలిపారు. పిల్లల చేత పని చేయించడం నేరమని, బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని తెలిపారు.
కిశోర బాలికలకు సంబంధించిన వివరాలు అంగన్వాడీ టీచర్ వద్ద ఉండాలన్నారు. కిశోర బాలికలు ఎక్కడ చదువుతున్నారు. ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం తప్పనిసరిగా సేకరించాలని సూచించారు.
అనంతరం ఎంపీడీవో మధులత మాట్లాడుతూ.. గ్రామాలలో, తాండాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్ రెడ్డి, ఐసీడీఎస్ మండల సూపర్వైజర్లు సరళ, కవిత, లక్ష్మీనర్సమ్మ, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఐకేపీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Read Also :
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం