సీసీసీ నస్పూర్ : పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య తెలిపారు. శనివారం సీసీసీ సింగరేణి అతిథి గృహంలో కలెక్టర్ భారతీ హోళీకేరి అధ్యక్షతన పోడు భూముల్లో వ్యవసాయం, అటవీ పరిరక్షణపై మంచిర్యాల జిల్లా అఖిలపక్షం నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైనా రైతులకు పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పోడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషిచేయనున్నట్లు చెప్పారు. పట్టాల విషయంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని, మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కలెక్టర్ భారతీ హోళీకేరి మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలోని 14 మండలాల్లో 3వేల 546మంది రైతులు 8వేల 275 ఎకరాల పోడు భూముల్లో సాగు చేస్తున్నారని వెల్లడించారు. జిల్లాలో ఉన్న 311 గ్రామాల్లో 81గ్రామాల్లో అటవీ భూములు ఆక్రమణలను గుర్తించినట్లు చెప్పారు.
2005 డిసెంబర్ నెల కంటే ముందు నుంచే సాగు చేస్తున్న వారికి ఆర్వోఎఫ్ఆర్ ద్వారా పట్టాలు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా అటవీ శాఖ అధికారి శివాని డొంగ్రె, ఏసీపీలు అఖిల్ మహాజన్, నరేందర్, ఎడ్ల మహేశ్, మంచిర్యాల రూరల్ సీఐ తోట సంజీవ్, జడ్పీసీఈవో నరేందర్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.