మంచిర్యాలటౌన్ : మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది పుష్కరఘాట్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే దివాకర్రావు శనివారం పరిశీలించారు. ఆదివారం నిర్వహించే గణేశ్ నిమజ్జనం సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదిలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చాలా మంది భక్తులు ఇక్కడికి రానున్న నేపథ్యంలో తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు ఆయన సూచించారు. ముఖ్యంగా దారి పొడవునా విద్యుత్ దీపాలు ఏర్పాటు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, నదిలోపలదాకా వెళ్లకుండ తగిన ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.
పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని, నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. అందుబాటులో గజ ఈతగాళ్లను ఉంచాలని, నిమజ్జనం కార్యక్రమం సాఫీగా, భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సహాలతో పూర్తి చేయాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్, మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ, పట్టణ సీఐ ముత్తి లింగయ్య, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.