RS Praveen Kumar : కొల్లాపూర్ ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ నాయకులపై చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చిన్న కారుపాములకు చెందిన బీఆర్ఎస్ నాయకులు వేమిరెడ్డి జగదీష్ రెడ్డిపై కర్రలతో పాశవికంగా దాడి చేయడంపై ఆయన స్పందించారు.
దీనిపై బాధితునితో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు రక్షణ లేదని విమర్శించారు. కొల్లాపూర్ ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతున్నాయని మండిపడ్డారు. నిందితులను పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు ఎవరు భయపడొద్దన్న ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.