మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు కానుకగా ఇంటిని నిర్మించి అందజేసిన పురాణం
కోటపల్లి, జూలై 24 : నిరుపేద వృద్ధ దంపతులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అండగా నిలిచారు. రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ పురాణం కొత్త ఇంటిని నిర్మించి ఆ దంపతులతో గృహ ప్రవేశం చేయించారు. కోటపల్లి మండలకేంద్రానికి చెందిన రాగం పోసక్క-మల్లయ్యలది నిరుపేద కుటుంబం. వారు ఉంటున్న పూరి గుడిసె శిథిలావస్థకు చేరింది. ఆ వృద్ధులు ఇబ్బందులు పడుతుండగా, పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ తన సొంత డబ్బులతో వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టి రెండు నెలల్లోనే ఇంటిని నిర్మించి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వారితో శనివారం గృహ ప్రవేశం చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస రావు, చెన్నూర్ మున్సిపల్ చైర్మన్ అర్చనా గిల్డా, చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అజ్గర్, పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, రైతుబంధు మండల కన్వీనర్ గుర్రం రాజన్న, స్థానిక సర్పంచ్ రాగం రాజక్క, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైస ప్రభాకర్, చెన్నూర్ మాజీ సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, నాయకులు ముల్కల్ల శశిపాల్ రెడ్డి, గట్టాగౌడ్, మంత్రి రామయ్య, గోనె మోహన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేటీఆర్ ఆలోచనలే స్ఫూర్తి :పురాణం
మంత్రి కేటీఆర్ ఆలోచనలే స్ఫూర్తిగా తాను నిరుపేద వృద్ధ దంపతులకు తన సొంత డబ్బులతో కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చినట్లు ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో, మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేయనున్నట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్లోపని చేస్తూ ప్రజలకు సేవ చేయడం తన అదృష్టమని ఎమ్మెల్సీ తెలిపారు.
ఇల్లు కట్టించిన దేవుడు మా సతీశ్ సార్
‘కూలిపోయే ఇంట్లో కాలం వెల్లదీస్తున్న తమ కష్టాలను కండ్లారా చూసి ఇల్లు కట్టించిన దేవుడు మా సతీశ్ సార్’ అని రాగం పోసక్క-మల్లయ్య పేర్కొన్నారు. పూరి గుడిసెలో ప్రభుత్వం అందిస్తున్న పింఛన్తో బతుకుతున్న తమను రూపాయి ఖర్చు పెట్టనీయకుండా మా ఊరి సారు ఇల్లు కట్టించాడని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ నిండు నూరేళ్లూ సంతోషంగా ఉండాలని ఆ దంపతులు ఆకాంక్షించారు.