పొంచిఉన్న థర్డ్ వేవ్ క్రమేపీ పెరుగుతున్న కేసులు
అప్రమత్తమైన యంత్రాంగం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం
ఇప్పటి వరకు 1,96,370 మందికి పూర్తి
మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో 140 బెడ్లు సిద్ధం
నిర్లక్ష్యం వద్దంటున్న ఆరోగ్యశాఖ
మంచిర్యాల, జూలై 17, నమస్తే తెలంగాణ : కరోనా థర్డ్ వేవ్ (డెల్టా వేరియంట్) రూపంలో పొంచి ఉండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తగా ఉండాలని పదేపదే సూచిస్తున్నది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే, ప్రభుత్వ దవాఖానల్లో బెడ్లను సిద్ధం చేసింది. కొవిడ్ మళ్లీ పుంజుకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని, వైరస్ వ్యాప్తి అంతానికి ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని, టీకాలు వేసుకోవాలని ఆరోగ్యశాఖ సూచిస్తున్నది.
నిర్లక్ష్యంతో పెరుగుతున్న కేసులు..
కరోనా రెండో వేవ్ జిల్లా ప్రజలను అతలాకుతలం చేసింది. మొదటి విడుతతో పోలిస్తే రెండో విడుతలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయా రు. మే 12 నుంచి ప్రభుత్వం విడుతలవారీగా లాక్డౌన్ కొనసాగించడంతో క్రమేపీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. లాక్డౌన్ను ఎత్తివేసిన మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 26 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా, వారం తర్వాత 36 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కానీ, పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టాయన్న నిర్లక్ష్యంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముందు వరుసలో ఉండడం, మంచిర్యాల జిల్లా 5,6 స్థానాల్లో ఉండడం శోచనీయం. వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య 40పైనే ఉంటుంది. ఈ నెల 10న..46 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11న 25కు చేరింది. 13న జిల్లాలో 65 మందికి పాజిటివ్ రాగా, 15న 47 మందికి వచ్చింది. శుక్రవారం 16న పాజిటివ్ కేసుల సంఖ్య 45కు చేరుకుంది. వారం రోజులుగా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 40పైనే ఉండడం గమనార్హం.
యంత్రాంగం అప్రమత్తం
థర్డ్వేవ్ పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడంతో కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని తరచూ సూచిస్తున్నది. మరోవైపు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూనే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది. జిల్లాలో ఈ నెల 16వ తేదీ వరకు 1,96,370 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
ప్రభుత్వ దవాఖానలో ఏర్పాట్లు
థర్డ్వేవ్ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్ బాధితుల కోసం 140 బెడ్లను సిద్ధంగా ఉంచారు. ఇందులో 25 పడకలను పిల్లల కోసం కేటాయించారు. పిల్లల 25 బెడ్స్లలో 15 ఐసీయూవి కాగా, మిగతా 10 సాధారణ పడకలను అందుబాటులో ఉంచారు.