వనపర్తి : పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి రామ థియేటర్ వరకు రోడ్డు విస్తరణకు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను మున్సిపల్ , విద్యుత్, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
సకాలంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, అంతకు ముందు ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన ముందస్తు చర్యలు వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని సందర్శించారు. కళాశాల శిథిలావస్థకు చేరుకున్నందున అక్కడి నుంచి ఖాళీ చేయించి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే ఉర్దూ మీడయం పాఠశాలను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్. ఈ నాగేందర్, ఆర్ అండ్ బీ డీఈ దానయ్య, తహశీల్దార్ రాజేందర్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.